AP Cabinet: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్‌లో కీలక నిర్ణయాలు..

Ap Cabinet

Ap Cabinet

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన కీలక మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా దాదాపు 85 కి పైగా కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కోట్లాది రూపాయల పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన , మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ఈ సమావేశంలో పలు ప్రతిపాదనలను క్యాబినెట్ పరిశీలించింది.

పారిశ్రామిక పెట్టుబడులు..
రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు భారీ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు, భూ కేటాయింపులపై క్యాబినెట్ ప్రత్యేక దృష్టి సారించింది. నాయుడుపేటలో రూ.10 వేల కోట్లకు పైగా అంచనాతో ప్రీమియర్ ఎనర్జీ విస్తరణ, ప్రకాశం జిల్లాలో రూ.1,230 కోట్ల జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్రాజెక్టు, తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాల సవరణలపై చర్చించారు.

అనకాపల్లిలో రూ.2,788 కోట్లతో CtrlS డేటా సెంటర్, విశాఖలో Sify డేటా సెంటర్‌కు అదనపు భూముల కేటాయింపుతో పాటు.. విశాఖలో Infinx ఐటీ క్యాంపస్ ద్వారా 4 వేల ఉద్యోగాల కల్పన ప్రతిపాదనను పరిశీలించారు. క్వాంటమ్ వ్యాలీ కింద 11 క్వాంటమ్, AI సంస్థల పెట్టుబడులు, డిఫెన్స్, మిసైల్, స్పేస్ రంగాలకు భూముల కేటాయింపు, విజయనగరంలో పతంజలి ఫుడ్ పార్క్‌కు 70 ఎకరాల భూమి, రూ.3,500 కోట్ల అరుదైన ఖనిజ మాగ్నెట్ల తయారీ ప్రాజెక్టులపై క్యాబినెట్ చర్చించింది.

అమరావతి అభివృద్ధి..
రాజధాని అమరావతి రూపురేఖలు మార్చేలా అమరావతిలో 5 స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే.. అమరావతి జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి రూ.130 కోట్లు, ఉండవల్లి ల్యాండ్ పూలింగ్ మౌలిక సదుపాయాల కోసం రూ.426 కోట్ల పనుల ప్రతిపాదనలపై చర్చించారు. APCRDAలో ల్యాండ్ పూలింగ్ పనుల నిమిత్తం 95 కొత్త పోస్టుల సృష్టిని పరిశీలించారు.

పాలసీలు..
ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను క్యాబినెట్ పరిశీలించింది. తిరుపతి మినహా రాష్ట్రంలోని మిగిలిన విమానాశ్రయాల్లో బార్లు, మద్యం విక్రయ కేంద్రాల ఏర్పాటు పాలసీపై చర్చించారు. జిల్లా కేంద్రాల్లో PPP విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు, ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులపై త్రైమాసిక పన్నును సీటుకు రూ.4 వేల నుంచి రూ.2,500కు తగ్గించే ప్రతిపాదనలు వచ్చాయి.

వీటితో పాటు మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధి కుదింపు, యాగంటి పంప్డ్ స్టోరేజ్ సామర్థ్యం 1500 MW కు పెంపు, అనంతపురంలో NTPC 1200 MW సోలార్ ప్రాజెక్ట్ మరియు పశ్చిమ గోదావరిలో టీడీపీ జిల్లా కార్యాలయానికి 2 ఎకరాల భూమి లీజు ప్రతిపాదనలపై క్యాబినెట్ విస్తృతంగా చర్చించింది.

వారికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్.. 

ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షులు రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. 2004 కంటే ముందు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని (ఓల్డ్ పెన్షన్ స్కీమ్ – OPS) పునరుద్ధరిస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు సర్వత్రా లబ్ది చేకూరనుంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు కావడం ద్వారా భవిష్యత్తులో ప్రతి ఉద్యోగికి సగటున దాదాపు 3 కోట్ల రూపాయల మేర భారీ సర్వీస్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లభించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ పెన్షన్ సమస్యకు పరిష్కారం చూపడం పట్ల ఉద్యోగ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.