ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దాదాపు 30కి పైగా కీలక అజెండా అంశాలకు ఆమోదం లభించింది. వాటిలో ముఖ్యంగా.. మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్. గ్రామాల్లో రూ.9,355 కోట్లతో 10 భారీ మల్టీ విలేజ్ తాగునీటి పథకాల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల కోసం రూ.1,811 కోట్లతో 2,943 తాగునీటి పథకాలకు అనుమతులు మంజూరు చేశారు. పెద్దగెడ్డ రిజర్వాయర్ కమాండ్ ఏరియా ఆధునికీకరణతో పాటు, కుప్పంలో ఫీడర్ ఛానెల్స్, బీరగానిపల్లె రిజర్వాయర్ పనులకు కేబినెట్ ఆమోదం లభించింది.
భూసమీకరణ నిర్ణయాలు.. అమరావతిలో రెండో విడత కింద భూములిచ్చే 7 గ్రామాల రైతులకు రూ.లక్షన్నర వరకు సాగు రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. 2026 జనవరి 6 కంటే ముందు తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ మాఫీ వర్తిస్తుంది. భూములిచ్చిన, ఇవ్వబోయే రైతులకు ఏటా మెట్ట భూములకు రూ.3 వేలు, జరీబు భూములకు రూ.5 వేల చొప్పున కౌలు పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీనితో మొత్తం కౌలు మెట్ట రైతులకు రూ.40 వేలకు, జరీబు రైతులకు రూ.60 వేలకు చేరనుంది. రెండో విడత భూసమీకరణ పరిధిలోని 307 ఎకరాల ఇనాం భూములకు గానూ దేవదాయశాఖకు రూ.159 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. సీఆర్డీఏ (CRDA) ఆమోదించిన సంస్థలకు, ఎన్ఎఫ్డీబీ (NFDB) భారీ అక్వేరియం-కార్యాలయానికి, అలాగే ఈశా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సీఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ సంస్థలకు భూకేటాయింపులు జరపనున్నారు.
నెల్లూరులో ITC హోటల్, కడపలో మాధవి హోటల్, విజయవాడలో సరోవర్ పోర్టికో హోటల్కు ప్రత్యేక ప్రోత్సాహకాలను ఆమోదించారు. కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్మెంట్ పార్కు ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్త పర్యాటక పాలసీలో భాగంగా రాష్ట్రంలో భారీ కాన్సర్ట్ (సంగీత/సాంస్కృతిక ప్రదర్శనలు)ల నిర్వహణకు ప్రత్యేక విధానాన్ని ప్రతిపాదించారు. పర్యాటక ప్రచారానికి రూ.50 కోట్లు కేటాయించారు. ఎస్ఐపీబీ (SIPB) సిఫార్సుల మేరకు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు. తిరుపతి జిల్లాలో 63 ఎకరాల్లో లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుపై చర్చించారు. విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో ‘అంబేడ్కర్ గురుకుల సీవోఈ (COE)’ ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. విద్యార్థులకు ఐఐటీ జేఈఈ (IIT JEE), నీట్ (NEET) పరీక్షల కొరకు రెసిడెన్షియల్ కోచింగ్ ఇచ్చే ప్రతిపాదనలకు క్యాబినెట్ ఓకే చెప్పింది. విశాఖపట్నంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఆమోదం లభించింది.
సోషల్ మీడియా దుష్ప్రచారంపై సీరియస్..
కేబినెట్ అజెండా ముగిసిన తర్వాత సోషల్ మీడియా ట్రెండ్స్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రులు, సీఎం సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా మరియు ఇతర పోలీస్ అధికారులు సోషల్ మీడియా పోస్టులపై కేబినెట్కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కూటమి నేతలను కించపరుస్తూ వస్తున్న వీడియోలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భావప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తూనే, హద్దులు మీరిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని అడ్డుకోవడానికి వెంటనే ఒక ప్రత్యేక ‘టాస్క్ఫోర్స్’ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు శాఖను ఆదేశించారు. ఈ టాస్క్ఫోర్స్ కోసం అవసరమైతే బయటి నుంచి అదనపు సిబ్బందిని తీసుకోవాలని, చట్టపరమైన చిక్కులు రాకుండా కొత్తగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను (PP) నియమించుకోవాలని సూచించారు.
అసత్యాలు, వక్రీకరణలపై ఈ రోజు నుంచే నిఘా పెట్టాలని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి ఒక ప్రత్యేక పటిష్టమైన మెకానిజం తీసుకురావాలని సీఎం అన్నారు. ఇప్పటికే ఉన్న కేబినెట్ సబ్ కమిటీలోనూ దీనిపై చర్చించనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే వైసీపీ నేతలు మన ఎమ్మెల్యేలను కావాలని రెచ్చగొడుతున్నారని సీఎం పేర్కొన్నారు. అనంతపురం మిగతా జిల్లాల సంఘటనలను ప్రస్తావిస్తూ, “వారు మనల్ని ట్రాప్లోకి లాగుతున్నారు, ఎవరూ రెచ్చిపోవద్దు, జాగ్రత్తగా ఉండాలి” అని మంత్రులను హెచ్చరించారు.
ప్రతిపక్షాల ట్రాప్లో పడకుండా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరంగా వివరించాలని సూచించారు. జిల్లాల ఇంచార్జ్ మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని, రెవెన్యూ సమస్యలతో పాటు జిల్లాల్లోని ప్రతి చిన్న, పెద్ద అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

