AP 10th Class Exams 2026 Begin Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు.. మూడు గంటల 15 నిమిషాల పాటు పరీక్ష జరగనుంది. విద్యార్థులు పరీక్ష సమయానికి అరగంట ముందే పరీక్షా కేంద్రంకు చేరుకోవాలి. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విద్యార్థులను ఉదయం 10 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అధికారులు అనుమతించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు వెళ్లొచ్చు.
6.40 లక్షల మంది విద్యార్థులు హాజరు:
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 6,22,074 మంది రెగ్యులర్ అభ్యర్థులు కాగా.. 18,842 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. బాలురు 3,28,652 మంది ఉండగా.. బాలికలు 3,12,264 మంది పరీక్షలు రాయనున్నారు.
3,415 పరీక్షా కేంద్రాల ఏర్పాటు:
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 210 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు 156 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. అలాగే 33,882 మంది ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించారు. ఈసారి తొలిసారిగా 7,429 మంది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను కూడా ఇన్విజిలేటర్లుగా నియమించడం విశేషం.
Also Read: Today Astrology: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
విద్యార్థులకు ముఖ్య సూచనలు:
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ముందుగా తమ ఓఎంఆర్ షీట్పై ఉన్న ఫొటో, పేరు, రోల్ నంబర్ వంటి వివరాలను తప్పనిసరిగా సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్థులకు సమాధానాలు రాయడానికి 24 పేజీల బుక్లెట్ ఇస్తారు. అది పూర్తయిన తర్వాత అవసరమైతే అదనంగా 12 పేజీల బుక్లెట్ను అందిస్తారు. అధికారులు విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు.
