Site icon NTV Telugu

Prajwal Revanna: ప్రజ్వల్‌కు మళ్లీ లుకౌట్ నోటీసులు.. నిందితులకు శిక్ష పడాలన్న రాహుల్

Dlee

Dlee

కర్ణాటక రాజకీయాలను లైంగిక వేధింపుల కేసు కుదిపేస్తోంది. మాజీ ప్రధాని మనవడు చేసిన దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసును కర్ణాటక ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. ఇప్పటికే సిట్ బృందం జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు నోటీసులు ఇచ్చింది. తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది.

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌ లపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో కర్ణాటక సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు శనివారం హాసనలోని ప్రజ్వల్‌ ఇంటికి వెళ్లారు. అభ్యంతర వీడియోల దర్యాప్తులో భాగంగా ఆయన ఇంట్లోని సిబ్బందిని ప్రశ్నించనున్నారు.

మరోవైపు ప్రజ్వల్‌పై రెండోసారి లుక్‌ఔట్‌ నోటీసు జారీ చేసినట్లు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర వెల్లడించారు. ఆయన తండ్రి రేవణ్ణ కూడా విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉన్నందున ఆయనకూ ఈ నోటీసులిచ్చినట్లు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం .. ఇటీవల వీరిద్దరినీ విచారణకు పిలిచింది. అయితే తనకు సమయం కావాలని ప్రజ్వల్‌ కోరారు. ఇందుకు తిరస్కరించిన అధికారులు.. ఆయనపై తొలిసారి లుకౌట్‌ నోటీసు జారీ చేశారు. ఈ కేసు వెలుగులోకి రాగానే ప్రజ్వల్‌ దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఈ నోటీసులతో ఆయన దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే వీలు ఉంటుంది.

ఇదిలా ఉంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ శనివారం లేఖ రాశారు. ఈ దారుణాలకు పాల్పడిన వ్యక్తులకు శిక్ష పడేలా చేయాలని, బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. దీనిపై సిద్ధరామయ్య స్పందించారు. ప్రజ్వల్‌ కేసు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ కేసులో పారదర్శక విచారణ జరిగేలా మేం కృషి చేస్తామని తెలిపారు.

Exit mobile version