Site icon NTV Telugu

Anna Hazare: లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్‌చిట్‌పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు

Annahazare

Annahazare

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా మరో 21 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ అంశంపై అన్నా హజారే స్పందించారు. న్యాయవ్యవస్థ తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. తీర్పును స్వాగతిస్తున్నామని… న్యాయవ్యవస్థ అత్యున్నతమైనది కాబట్టి తీర్పును అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు.

‘‘మన దేశం న్యాయవ్యవస్థపై నడుస్తుంది. దేశంలో న్యాయ వ్యవస్థ అత్యున్నత వ్యవస్థ. మనది అనేక రాజకీయ పార్టీలు, కులాలు, మతాలతో కూడిన పెద్ద దేశం. అయినప్పటికీ న్యాయ వ్యవస్థ కారణంగా అది సరిగ్గా నడుస్తోంది.’’ అని అన్నా హజారే మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని తన స్వగ్రామం రాలేగాన్ సిద్ధిలో మాట్లాడారు.

కేజ్రీవాల్ కు ఇప్పుడు ఏమి సలహా ఇవ్వాలనుకుంటున్నారని అడిగినప్పుడు.. ‘‘సమాజం కోసం… దేశం కోసం పని చేయండి. మీ గురించి లేదా పార్టీ గురించి ఆలోచించకండి..’’ అని సూచించారు. బలమైన జన లోక్‌పాల్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2011లో జరిగిన ‘ఇండియా అగైన్స్ట్ కరప్షన్’ ఉద్యమంలో హజారే, కేజ్రీవాల్, సిసోడియా కీలక వ్యక్తులుగా ఉన్నారు. ఆ ఉద్యమం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేసింది.

ఢిల్లీ పాలసీ కేసులో మార్చి 21, 2024న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. 155 రోజులు జైల్లో ఉన్న తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. జైల్లో ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగి.. విడుదలయ్యాక రాజీనామా చేశారు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాక అన్నా హజారే మాట్లాడుతూ.. జన్ లోక్‌పాల్ ఉద్యమంలో భాగమైన వ్యక్తిని అవినీతి కేసులో అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేజ్రీవాల్ కోట్లాది మంది దేశవాసుల నమ్మకాన్ని మోసం చేశారని, రాజకీయ ఆశయాలు 2011 అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నాశనం చేశాయని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Bhadradri Kothagudem: ఇంటర్ పరీక్షా కేంద్రంలోని టాయ్‌లెట్‌లో.. మృత శిశువుకు జన్మనిచ్చిన ఫస్ట్ ఇయర్ విద్యార్థిని

Exit mobile version