US Plane Crash: అమెరికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువకుడు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం రాజానగర్ క్యాంప్కు చెందిన సాయి కార్తీక్ వర్మ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది మరణించినట్లు తెలుస్తోంది. పసిఫిక్ ఏరోస్పేస్ పీ750 స్కైడైవింగ్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. విమానంలో పైలట్తో పాటు 11 మంది స్కైడైవర్లు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
మృతుడు సాయి కార్తీక్ వర్మ, సుబ్రమణ్యం రాజు కుమారుడు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాగా, కుటుంబం చాలా కాలంగా కర్నూలు జిల్లా కౌతాళంలో స్థిరపడింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన కార్తీక్, ఇటీవలే తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీ’లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కార్తీక్, ప్రస్తుతం కాన్సాస్ రాష్ట్రంలో నివసిస్తున్నాడు. సరదాగా స్కైడైవింగ్ చేయడానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం సంభవించడం కుటుంబ సభ్యులను, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కార్తీక్ మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. కార్తీక్ మృతదేహం భీమవరం చేరుకునే అవకాశముందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో కౌతాళం, భీమవరం ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రతిభావంతమైన యువకుడి అకాల మరణం పట్ల బంధువులు, స్నేహితులు, స్థానికులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

