AP COVID-19 Update: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 19కు చేరినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో గుంటూరు, కాకినాడ జిల్లాల్లో చెరో రెండు కేసులు నమోదు కాగా, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో చెరో ఒక్క కేసు నమోదైంది.
ప్రస్తుతం రాష్ట్రంలో నలుగురు కరోనా కారణంగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు కోలుకుని డిశ్చార్జి కాగా, ఎనిమిది మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో నలుగురు హోం ఐసోలేషన్లో ఉండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల నమోదవుతున్న కరోనా కేసులకు ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కారణమని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. కాగా, గతంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చిన కరోనా కేసులు.. మరోసారి క్రమంగా పెరుగుతుండడం.. ఆందోళన కలిగిస్తోంది..

