Site icon NTV Telugu

Amit Shah: “నక్సలిజం”చరిత్రను తవ్వి బయటపెట్టిన అమిత్ షా.. ఆ 90 నిమిషాలు దద్దరిల్లిన పార్లమెంట్!

Amit Shah

Amit Shah

Amit Shah: నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్రం ఆపరేషన్ కగార్ నిర్వహించింది. కేంద్ర హోమంత్రి గతేడాది స్పష్టంగా చెప్పారు. మార్చి 31, 2026 వరకు డెడ్‌ లైన్ విధించారు. మావోయిస్టులు ఎక్కడ ఉన్నా అందరూ లొంగిపోవాలని పిలపునిచ్చారు. మార్చి 31 వరకు మావోయిస్టు రహిత భారత్‌గా చేయాలన్నది అమిత్‌ షా లక్ష్యం. ఇప్పటికే దాదాపు అందరు నక్సలైట్లు లొంగిపోయారు. ఈ తరుణంలో సోమవారం పార్లమెంట్‌లో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. దేశం నక్సలిజం నుంచి విముక్తి పొందిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఈ సందర్భంగా సభలో రాజకీయ వ్యూహప్రతివ్యూహాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ప్రసంగానికి రెండు గంటల ముందు అమిత్‌ షా పార్లమెంట్‌కు వచ్చారు. తెల్లటి కుర్తా, జాతీయ పతాక వర్ణాలతో కూడిన కండువాను ధరించారు. పార్లమెంట్‌లోకి వస్తున్నప్పుడు చాలా సైలెంట్‌గా కనిపించారు. షా ఎదురుగా ఉన్న ప్రతిపక్ష నేతల బెంచీలు ఖాళీగా ఉన్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, డింపుల్ యాదవ్ వంటి కీలక నేతలెవరూ అక్కడ లేరు. ఇక పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులందరూ మాట్లాడిన మాటలను అమిత్ షా ఏకాగ్రతతో విన్నారు. అన్ని పాయింట్స్ క్షుణ్ణంగా గమనించారు. ప్రతిపక్ష నేతలు మాట్లాడిన కొన్ని మాటలను తన డైరీలో రాసుకున్నారు. ఇలా ప్రతిపక్షాల విమర్శలకు పాయింట్ వారీగా సమాధానం చెప్పేందుకు షా సిద్ధమయ్యారు.

READ MORE: Thaai Kizhavi : ఓటీటీలోకి రాధిక బ్లాక్‌బస్టర్.. ‘థాయ్ కిళవి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

ఈ తరుణంలో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే 35 ఏళ్ల కిందట నక్సలైట్ల చేతిలో బలైన తన తాత గురించి ప్రస్తావించారు. తన తాత అస్తికలు నేటికీ దొరకలేదని ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. ఆ సమయంలోనే నటి, ఎంపీ కంగనా రనౌత్ సభలోకి ప్రవేశించారు. దూబే ప్రసంగం ముగియగానే అమిత్ షా ఆయన్ని దగ్గరకు పిలిచి కొన్ని కీలక పత్రాలను అడిగి తీసుకున్నారు. అనంతరం కంగనా రనౌత్, కాంగ్రెస్ నాయకత్వంపై పదునైన విమర్శలు చేస్తూ నక్సలిజం అణచివేతలో ప్రధాని మోడీ పాత్రను కొనియాడారు. దీనిపై ప్రతిపక్ష ఎంపీలు మాణిక్కం ఠాగూర్ నేతృత్వంలో నినాదాలు చేస్తూ అడ్డు తగిలే ప్రయత్నం చేసినా, ఆమె ఏమాత్రం తగ్గకుండా తన వాదనను వినిపించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కంగనా ప్రసంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కథ ఇక్కడితో ముగియలేదు. అసలు కథ ఎప్పుడే స్టార్ట్ అయ్యింది.

READ MORE: Tahir Anwar Death: “చచ్చాడా? చంపారా?”.. పాకిస్థాన్‌లో జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అనుమానాస్పద మృతి

సరిగ్గా సాయంత్రం 6:04 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో విజిటర్స్ గ్యాలరీలో ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ ఉండటం గమనార్హం. అమిత్ షా తన ప్రసంగంలో చరిత్రను తవ్వి తీస్తూ ఇందిరా గాంధీ హయాంలో నక్సల్ భావజాలానికి రాజకీయ మద్దతు లభించిందని ఆరోపించారు. “పేదరికం వల్ల నక్సలిజం రాలేదు, నక్సలిజం వల్లే పేదరికం పెరిగింది (గరీబీ కే కరణ్ నక్సల్వాద్ నహీ ఫైలా, బాల్కీ నక్సల్వాద్ కే కరణ్ గరీబీ ఫైలీ)” అంటూ షా చేసిన వ్యాఖ్య ప్రతిపక్షాల వాదనను తలకిందులు చేసింది. ఆయుధాలు పట్టే వారు చర్చలకు వస్తే సరే, లేదంటే బలప్రయోగం తప్పదని మరోసారి హెచ్చరించారు షా. ఈ క్రమంలో హనుమాన్ బెనివాల్ వంటి నేతలతో ఆయనకు వాగ్వివాదం జరిగింది. గడిచిన ఆరు రోజుల్లో తాను నక్సలైట్లను సమర్థించే 2,000 వ్యాసాలను సమీక్షించానని, అవి బాధితుల పట్ల సానుభూతి చూపడం లేదని షా మండిపడ్డారు. తమ ప్రభుత్వం నక్సలిజంపై పోరాటంలో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌తో ముందుకు వెళ్తోందని అమిత్ షా వివరించారు. 2019 ఆగస్టు 20న హోం శాఖలో జరిగిన కీలక సమావేశం ద్వారా పునరావాస కార్యక్రమాలకు పునాది పడిందని, 2024 ఆగస్టు 24న తాను చేసిన ప్రకటన ప్రకారం మార్చి 31, 2026 నాటికి భారత్ పూర్తిస్థాయిలో నక్సల్ రహిత దేశంగా మారుతుందని స్పష్టం చేశారు. రాత్రి 7:25 గంటల వరకు సాగిన అమిత్ షా 90 నిమిషాల ప్రసంగం, కేవలం ఒక ప్రకటనలా కాకుండా గణాంకాలు, చరిత్ర, బలమైన రాజకీయ సందేశాల కలయికలా సాగింది. నిశ్శబ్దంగా మొదలైన షా ఉనికి, చివరకు సభలో ప్రతిపక్షాల నినాదాల మధ్య ఒక గర్జనలా ముగిసింది. అమిత్ షా వేసిన ఈ వ్యూహాత్మక అడుగు నక్సలిజంపై ప్రభుత్వ పట్టును, రాజకీయ పటిమను చాటిచెప్పింది. ఆ 90 నిమిషాల్లో అమిత్ షా నిశ్శబ్దంగా నోట్స్ రాసుకోవడం నుంచి చరిత్ర, సమాచారం, వాక్చాతుర్యాన్ని మేళవించి దూకుడుగా, పూర్తిస్థాయి రాజకీయ ఎదురుదాడికి దిగారు. సభ లోపల నుంచి చూస్తున్న వారికి, అది కేవలం ఒక ప్రసంగం కాదు. అది ఎంతో జాగ్రత్తగా రూపొందించిన ఒక రాజకీయ ప్రదర్శనలా కనిపించింది. నిశ్శబ్దంతో మొదలై గర్జనతో ముగిసింది షా ప్రసంగం.

Exit mobile version