Ram Mandir Prasad: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (CCPA) భారీ షాక్ ఇచ్చింది. సాధారణ స్వీట్లను ‘శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’ పేరుతో తమ ప్లాట్ఫామ్పై విక్రయించేందుకు అనుమతించినందుకు అమెజాన్ సెల్లర్ సర్వీసెస్పై రూ.1 లక్ష జరిమానా విధించింది. ఎలాంటి అధికారిక అనుమతి లేకుండా సాధారణ స్వీట్లను రామ మందిర ప్రసాదంగా ప్రచారం చేయడం తప్పుదోవ పట్టించే ప్రకటనల కిందకు వస్తుందని CCPA స్పష్టం చేసింది.
2026 ఆగస్టు 4న జారీ చేసిన 19 పేజీల ఉత్తర్వుల్లో CCPA ఈ నిర్ణయం తీసుకుంది. అమెజాన్ ప్లాట్ఫామ్లో ‘శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’ పేరుతో సాధారణ స్వీట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించిన బెంచ్.. రామ మందిర ట్రస్ట్ నుంచి ఎలాంటి అధికారిక అనుమతి లేకపోయినా ఇలాంటి ఉత్పత్తులను విక్రయానికి అనుమతించడాన్ని తప్పుబట్టింది. ‘శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’ అనే పదానికి హిందూ భక్తుల్లో ప్రత్యేకమైన అర్థం ఉందని CCPA పేర్కొంది. అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముడికి సమర్పించి, ఆశీర్వదించిన పవిత్ర ఆహారాన్నే సాధారణంగా ప్రసాదంగా భావిస్తారని తెలిపింది. అలాంటి పదాన్ని ఎలాంటి అనుమతి లేకుండా సాధారణ మిఠాయిలకు ఉపయోగించడం తప్పుదోవ పట్టించే వాణిజ్య విధానమే కాకుండా కోట్లాది మంది వినియోగదారుల మతపరమైన భావాలను దెబ్బతీసే చర్యగా అభిప్రాయపడింది.
అమెజాన్ వంటి భారీ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో ఉత్పత్తులు కనిపించడం వల్ల వాటికి వినియోగదారుల దృష్టిలో సహజంగానే విశ్వసనీయత ఏర్పడుతుందని CCPA పేర్కొంది. దీంతో ఇలాంటి తప్పుదోవ పట్టించే ఉత్పత్తుల వల్ల కలిగే ప్రభావం మరింత పెరుగుతుందని తెలిపింది. ఈ వ్యవహారంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) 2024 జనవరి 19న CCPAకి ఫిర్యాదు చేసింది. అమెజాన్ ఇండియాలో నాలుగు రకాల స్వీట్లను ‘శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’ పేరుతో విక్రయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. వీటి ధరలు రూ.299 నుంచి రూ.385 వరకు ఉన్నట్లు తెలిపింది. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కేవలం మూడు రోజుల ముందు జనవరి 19, 2024న CCPA అమెజాన్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. వినియోగదారుల రక్షణ చట్టం, 2019తో పాటు ఈ-కామర్స్ నిబంధనలు, 2020ను ఉల్లంఘించినట్లు పేర్కొంది.
CCPA నోటీసు అందుకున్న తర్వాత అమెజాన్ ఈ ఉత్పత్తుల లిస్టింగ్స్ను తొలగించింది. అయితే తాము కేవలం మధ్యవర్తి ప్లాట్ఫామ్ మాత్రమేనని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 79 కింద ‘సేఫ్ హార్బర్’ రక్షణ తమకు వర్తిస్తుందని అమెజాన్ వాదించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ‘శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ తీర్పును కూడా తన వాదనకు ఆధారంగా ప్రస్తావించింది. అయితే అమెజాన్ వాదనను CCPA తిరస్కరించింది. ఐటీ చట్టం, ఈ-కామర్స్ నిబంధనలు వేర్వేరు చట్టపరమైన అంశాలను నియంత్రిస్తాయని పేర్కొంది. వినియోగదారుల రక్షణకు సంబంధించిన అమెజాన్ బాధ్యతలను కేవలం మధ్యవర్తి అనే హోదాతో తప్పించుకోలేమని స్పష్టం చేసింది.
CCPA డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) ద్వారా జరిపిన దర్యాప్తులో అమెజాన్ ప్లాట్ఫామ్లో విక్రేతలకు సంబంధించిన వివరాలు ఈ-కామర్స్ నిబంధనల ప్రకారం తగినంత స్పష్టంగా చూపలేదని గుర్తించింది. అలాగే ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ఉపయోగించేందుకు తప్పనిసరిగా లాగిన్ కావాల్సి ఉండటాన్ని కూడా CCPA తప్పుబట్టింది. వినియోగదారులకు స్పష్టమైన, సులభంగా అందుబాటులో ఉండే సమాచారాన్ని అందించాల్సిన నిబంధనలకు ఇది అనుగుణంగా లేదని పేర్కొంది.
అయితే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అమెజాన్ ఒక ప్రత్యేక ఫ్రేమ్వర్క్ను కూడా సమర్పించింది. ఇందులో రామ జన్మభూమి మందిర్, తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయం, శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం, శ్రీ జగన్నాథ ఆలయం, కేదార్నాథ్, బద్రీనాథ్, సోమనాథ్, ద్వారకాధీశ్, మహాకాళేశ్వర్ ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు, పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ‘ప్రసాద్’, ‘ప్రసాదం’, ‘మహాప్రసాద్’, ‘భోగ్’ వంటి పేర్లతో ఉత్పత్తులను విక్రయించాలంటే సంబంధిత మత సంస్థ నుంచి అధికారిక అనుమతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని CCPA ఆదేశించింది. CCPA ఉత్తర్వుల ప్రకారం వివాదాస్పద నాలుగు ఉత్పత్తుల ద్వారా మొత్తం రూ.25,26,309 స్థూల విక్రయాలు నమోదయ్యాయి. అయితే ఆ నాలుగు ఉత్పత్తుల ద్వారా వచ్చిన వాస్తవ ఆదాయం రూ.39,802.29గా ఉంది. ఇందులో అమెజాన్కు సర్వీస్ ఫీజు రూపంలో రూ.15,165.90 వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

