Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

  • దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం
  • అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
  • 2013 శిక్ష రద్దు.. నిందితుడి నిర్దోషిగా విడుదల
Allahabad High Court

Allahabad High Court

దంతాలు, చంకల్లో లేదా జననాంగాల దగ్గర వెంట్రుకలు ఉండటం ఆధారంగా ఒక బాలిక 18 ఏళ్లలోపు మైనర్ అని నిర్ధారించలేమని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ముఖ్యంగా మూడో మోలార్‌ (విజ్డమ్ టూత్‌) పళ్లు లేకపోవడం కూడా 18 ఏళ్లు పూర్తికాలేదని చెప్పడానికి నిర్ణయాత్మక ఆధారం కాదని పేర్కొంది.

2011 నాటి కిడ్నాప్‌ కేసులో నిందితుడికి విధించిన శిక్షను రద్దు చేస్తూ జస్టిస్ సుభాష్ విద్యార్థి ఈ తీర్పు వెలువరించారు. వైద్యులు, రేడియాలజిస్ట్‌ పరీక్షల ఆధారంగా బాలిక వయస్సు సుమారు 18 ఏళ్లు అని పేర్కొన్నప్పటికీ.. ట్రయల్ కోర్టు స్వయంగా ఆమె వయస్సును 14-17 ఏళ్ల మధ్యగా నిర్ధారించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. బాలికను పరీక్షించిన వైద్యుడు, రేడియాలజిస్ట్‌ ఆమె వయస్సు సుమారు 18 ఏళ్లు అని పేర్కొన్నప్పుడు.. ట్రయల్ కోర్టు తన సొంత అంచనాతో వారి అభిప్రాయాన్ని అధిగమించకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

మెడికో-లీగల్ పరీక్షలో బాలికకు ఎలాంటి గాయాలు లేవని నమోదైంది. అల్ట్రాసౌండ్‌లో 20 వారాల గర్భం ఉన్నట్లు తేలింది. కుడి మోకాలు, మోచేయి, మణికట్టు ప్రాంతాల్లోని ఎముకల కీళ్లు కలిసిపోయినట్లు ఎక్స్‌రేలో గుర్తించారు. రేడియాలజిస్ట్ ఆమె వయస్సును సుమారు 18 ఏళ్లుగా అంచనా వేశారు. పరీక్షించిన వైద్యుడు ఆమె వయస్సు 20 ఏళ్లు కూడా ఉండొచ్చని పేర్కొన్నారు.

ట్రయల్ కోర్టు బాలికకు 14×14 పళ్లు ఉన్నాయని, చంకల్లో, జననాంగాల దగ్గర వెంట్రుకలు ఉన్నాయని పరిగణనలోకి తీసుకుంది. ఈ లక్షణాల ఆధారంగా ఆమె వయస్సు 17 ఏళ్లలోపే ఉంటుందని నిర్ధారించింది. అయితే ఈ విధానాన్ని హైకోర్టు అంగీకరించలేదు. చంకల్లో, జననాంగాల దగ్గర వెంట్రుకలు ఉన్నాయని చెప్పడం ద్వారా అవి పూర్తిగా అభివృద్ధి చెందలేదని నిర్ధారించలేమని కోర్టు పేర్కొంది. అలాగే మూడో మోలార్‌ పళ్లు రావడం తప్పనిసరి కాదని, అవి లేకపోవడాన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తి 18 ఏళ్లు పూర్తి చేసుకోలేదని చెప్పలేమని స్పష్టం చేసింది.

మార్కుల జాబితాపైనా కోర్టు అభ్యంతరం

బాలిక ఎనిమిదో తరగతి మార్కుల జాబితాలో పుట్టిన తేదీ సెప్టెంబర్ 25, 1993గా ఉన్నట్లు ట్రయల్ కోర్టు పరిగణించింది. అయితే ఆ మార్కుల జాబితా అసలు కాపీగానీ, దాని నకలు కాపీగానీ కేసు రికార్డులో లేదని హైకోర్టు గుర్తించింది. దానికి ఎగ్జిబిట్ నంబర్ కూడా లేదని, రికార్డుల సూచికలో కూడా ఆ పత్రం లేదని పేర్కొంది. అంతేకాకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా సంబంధిత అధికారి ఆ పత్రాన్ని ధృవీకరించలేదని తెలిపింది. అందువల్ల కేసు రికార్డులో లేని పత్రంలో ఉన్న పుట్టిన తేదీని ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోవడం సరికాదని జస్టిస్ సుభాష్ విద్యార్థి పేర్కొన్నారు.

వయస్సు నిర్ధారణకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను అలహాబాద్ హైకోర్టు ప్రస్తావించింది. రేడియాలజీ పరీక్ష ద్వారా నిర్ధారించే వయస్సులో ఇరువైపులా రెండేళ్ల వరకు తేడా ఉండే అవకాశం ఉందని సుప్రీంకోర్టు గతంలో పేర్కొన్న విషయాన్ని గుర్తుచేసింది. ఈ కేసులో వైద్య నివేదిక ప్రకారం బాలిక వయస్సు సుమారు 18 ఏళ్లు. అనుమతించబడిన వయస్సు వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆమె వయస్సు 20 ఏళ్లు కూడా ఉండే అవకాశం ఉందని హైకోర్టు తెలిపింది. దీంతో ఘటన జరిగిన సమయంలో బాలిక మైనర్ అని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని కోర్టు తేల్చింది.

ఈ కేసులో బాలిక పోలీసుల ముందు ఇచ్చిన 161 స్టేట్‌మెంట్‌, మేజిస్ట్రేట్‌ ముందు ఇచ్చిన 164 స్టేట్‌మెంట్‌ను కూడా హైకోర్టు పరిశీలించింది. తాను నిందితుడితో స్వచ్ఛందంగానే వెళ్లానని, ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నామని ఆమె అప్పట్లో చెప్పినట్లు కోర్టు పేర్కొంది. తన తండ్రి సంబంధాన్ని వ్యతిరేకించడంతో తాను అతనితో కలిసి లూధియానాకు వెళ్లినట్లు, అనంతరం హర్దోయ్‌కు తిరిగి వచ్చి వివాహం చేసుకున్నట్లు ఆమె స్టేట్‌మెంట్లలో పేర్కొంది. తర్వాత మళ్లీ లూధియానాకు వెళ్లి భార్యాభర్తలుగా జీవించామని తెలిపింది. ఆ సమయంలో తాను గర్భవతిగా ఉన్నానని, తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడం కంటే నిందితుడితోనే ఉండాలని కోరుకున్నట్లు కూడా చెప్పింది. అయితే విచారణ సమయంలో మాత్రం నిందితుడు తనకు ఏదో పదార్థాన్ని పీల్చేలా చేశాడని, ఆ తర్వాత స్పృహ కోల్పోయి లూధియానాలో మేల్కొన్నానని ఆమె ఆరోపించింది.

విచారణ సమయంలో ఇచ్చిన వాంగ్మూలం.. గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్ల మధ్య ఉన్న వ్యత్యాసాలను కూడా హైకోర్టు పరిశీలించింది. గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్లను ఆమె పూర్తిగా తిరస్కరించలేదని కోర్టు పేర్కొంది. అలాగే ఒక వయోజన మహిళను నిందితుడు ఒక్కడే స్పృహ తప్పిన స్థితిలో ఉత్తరప్రదేశ్‌ నుంచి లూధియానాకు తీసుకెళ్లాడా? అనే అంశాన్ని కూడా కోర్టు ప్రశ్నించింది. ఆమె సుమారు ఏడు నెలల పాటు నిందితుడితో ఉన్నప్పటికీ బలవంతం గురించి ఆరోపించలేదని గుర్తించింది. సాక్షి వాంగ్మూలం ప్రారంభం నుంచి విచారణ వరకు స్థిరంగా ఉండి.. అన్ని దశల్లోనూ కఠినమైన పరిశీలనను తట్టుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొన్న ‘స్టెర్లింగ్ విట్నెస్’ ప్రమాణాన్ని హైకోర్టు ప్రస్తావించింది.

2013 శిక్ష రద్దు..  నిర్దోషిగా విడుదల

2011లో నమోదైన ఈ కేసులో భయ్యా లాల్ రైదాస్‌కు ట్రయల్ కోర్టు 2013లో ఐపీసీ సెక్షన్ 366 కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. అయితే సెక్షన్లు 363, 376 కింద నమోదైన ఆరోపణల నుంచి అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. తాజాగా అలహాబాద్ హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును పక్కనపెట్టి రైదాస్‌ను సెక్షన్ 366 కింద కూడా నిర్దోషిగా విడుదల చేసింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు అప్పీల్‌పై నోటీసులు జారీ చేస్తే హాజరయ్యేందుకు వ్యక్తిగత బాండ్‌, ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. గతంలో సమర్పించిన పూచీకత్తులను విడుదల చేసింది.