భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. వైశాఖ మాసంలో వచ్చే ఈ తిథిని అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. ‘అక్షయ’ అంటేనే క్షయం లేనిది లేదా ఎప్పటికీ తరగనిది అని అర్థం. ఈ రోజున మనం చేసే ఏ మంచి పని అయినా, అది దైవ ప్రార్థన కావచ్చు లేదా దానధర్మాలు కావచ్చు, వాటి వల్ల కలిగే ఫలితం అక్షయంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కృతయుగం ఈ రోజునే ప్రారంభం కావడంతో దీనిని ‘యుగాది తిథి’ అని కూడా పిలుస్తారు. అలాగే వేద వ్యాసుడు మహాభారతాన్ని రాయడం ప్రారంభించిన రోజు, గంగానది భూమికి దిగివచ్చిన రోజు కూడా ఇదే కావడం ఈ పండుగ చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటుతోంది.
దాన ధర్మాల ప్రాముఖ్యత – ఉదకుంభ దానం విశేషం:
అక్షయ తృతీయ రోజున దానధర్మాలకు ఉన్న ప్రాముఖ్యత మరే రోజున ఉండదు. ముఖ్యంగా ప్రస్తుతం ఎండలు మండుతున్న వేసవి కాలం కావడంతో, తోటి ప్రాణుల దాహార్తిని తీర్చడం పరమాత్మకు చేసే సేవగా భావిస్తారు. ఈ రోజున ‘ఉదకుంభ దానం’ అంటే మట్టి కుండలో స్వచ్ఛమైన నీటిని నింపి, అందులో గంధం, పుష్పాలు వేసి పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దీనితో పాటు బాటసారులకు చల్లని మజ్జిగ, బెల్లం పానకం, పండ్ల రసాలు పంపిణీ చేయడం వల్ల పితృదేవతలు శాంతిస్తారని, తద్వారా వంశాభివృద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఎండ నుంచి రక్షణ కల్పించేలా చెప్పులు, గొడుగులు, విసనకర్రలు దానం చేయడం ఈ రోజున అత్యంత విశేషమైన ఫలితాలను ఇస్తుంది.
లక్ష్మీ కటాక్షం కోసం పూజా విధానాలు:
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలని కోరుకునే వారు అక్షయ తృతీయ నాడు మహాలక్ష్మిని భక్తితో ఆరాధించాలి. ఈ రోజున ఉదయాన్నే పవిత్ర నదీ స్నానం చేయడం, కుదరని పక్షంలో ఇంట్లోనే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకుని స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి. పూజ గదిలో లక్ష్మీ నారాయణుల పటాన్ని ఉంచి, తామర పూలు లేదా గులాబీలతో అర్చించి, లక్ష్మీ అష్టోత్తరం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఇంట్లో సిరిసంపదలు వెల్లి విరుస్తాయి. చాలామంది ఈ రోజున బంగారం కొంటేనే అదృష్టం కలిసి వస్తుందని భావిస్తారు, కానీ వాస్తవానికి అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడం మాత్రమే కాదు, ఉన్నంతలో దానధర్మాలు చేయడం ద్వారా పుణ్యాన్ని మూటగట్టుకోవడమే అసలైన పరమార్థం.
