సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కుమార్తె నిత్తారా (Nitara) సైతం వేధింపులకు గురికావడం సంచలనం సృష్టించింది. గత ఏడాది నుంచి సాగుతున్న ఈ కేసులో మహారాష్ట్ర సైబర్ పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సైబర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADG) యశస్వి మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో అక్షయ్ కుమార్ కుమార్తె చూపిన ధైర్యం కీలకమని పోలీసులు తెలిపారు. “ఆమె ధైర్యంగా ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడం వల్లే మేము నిందితుడిని పట్టుకోగలిగాము. ఇలాంటి విషయాల్లో పిల్లలు మౌనంగా ఉంటే నేరగాళ్లు మరింత రెచ్చిపోతారు” అని అధికారులు పేర్కొన్నారు.
గతంలో ముంబైలో జరిగిన ‘సైబర్ అవేర్నెస్ మంత్ 2025’ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టారు. తన కుమార్తె ఆన్లైన్లో గేమ్ ఆడుతున్న సమయంలో ఒక అపరిచితుడు ఆమెకు మెసేజ్లు పంపాడని, అసభ్యకరమైన ఫొటోలు (Nude Photos) పంపాలని వేధించినట్లు తెలిపారు. అయితే, ఆ చిన్నారి భయపడకుండా వెంటనే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడం విశేషం. అక్షయ్ కుమార్ వెంటనే సైబర్ క్రైమ్ అధికారులను ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, అక్షయ్ తీసుకున్న చొరవపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
