NTV Telugu Site icon

Air Pollution: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. రోజూ 2 వేల మంది చిన్నారుల బలి!

Air Pollustion

Air Pollustion

Air Pollution: వాయుకాలుష్యం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలతో ప్రతి రోజూ ప్రపంచవ్యాప్తంగా 2 వేల మంది చిన్నారులు చనిపోతున్నారని తాజా నివేదికలో వెల్లడైంది. 2021లో వాయుకాలుష్యం దెబ్బకు 81 లక్షల మంది మరణించినట్లు ఈ అధ్యయనం తేల్చింది. అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యధిక మరణాలకు కారణమవుతున్న అంశాల్లో బీపీ తరువాత స్థానంలో వాయు కాలుష్యం నిలిచింది. పొగాకు, పోషకాహార లోపం కంటే ఎక్కువగా వాయు కాలుష్యమే ప్రజలను బలితీసుకుంటోందని ఈ రిపోర్టులో వెల్లడైంది. వాయు కాలుష్యం ప్రభావం చిన్నారులపై అధికంగా ఉన్నట్టు తేలింది. యూనీసెఫ్‌తో కలిసి హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ఈ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఐదేళ్ల లోపు సుమారు 7 లక్షల మంది చిన్నారులు ఈ వాయు కాలుష్యానికి బలైనట్టు తెలిపింది.

Read Also: Minister TG Bharath: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీజీ భరత్.. స్పెషల్‌ స్టేటస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇక, ఇందులో 5 లక్షల మరణాలు ఆఫ్రికా, ఆసియా దేశాల్లోని ఇళ్లల్లో నాలుగు గోడల మధ్య బొగ్గు, చెక్కలు, పేడ లాంటి వాటిని వంటచెరకుగా వాడటమేనని ఈ నివేదికలో తేలింది. వాయు కాలుష్య సంబంధిత మరణాల్లో 90 శాతానిపైగా పీఎమ్ 2.5 అనే సూక్ష్మ ధూళి కణాలే కారణం అని తేల్చింది. పీఎమ్ 2.5 సూక్ష్మధూళి కణాల కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్, డయాబెటిస్ తదితర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ చెప్పుకొచ్చింది. అయితే, వాస్తవ పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొనింది. వాతావరణ మార్పుల కారణంగా తలెత్తుతున్న ఓజోన్ కాలుష్యం 2021లో 5 లక్షల పైచిలుకు చిన్నారులను బలితీసుకుంది. గ్రీన్ హౌస్ వాయువు విడుదల తగ్గించాలని శాస్త్రవేత్తలు ఈ నివేదికలో తేల్చారు. ముఖ్యంగా ఇళ్లల్లో వంటకు బొగ్గు, చెక్కలాంటి ఇంధనాల వినియోగం తగ్గించాలని చెప్పింది. ఈ అంశంలో చైనా మంచి పురోగతి సాధించింది అని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది.

Read Also: Russia-North Korea: రష్యా- నార్త్ కొరియా మధ్య నూతన భాగస్వామ్య ఒప్పందం..

కాగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్ల మంది బేసిక్ స్టవ్‌లు లేదా మంటలపై ఆహారం వండుతూ ప్రమాదకరమైన వాయువులను పీలుస్తున్నారు. అయితే, మరింత మెరుగైన స్టవ్‌లు, ఇంధనాలు అందుబాటులోకి రావడంతో 2020 నుంచి చిన్నారుల మరణాలు సగానికి పైగా తగ్గిపోయాయని వెల్లడించింది. దాదాపు 200 దేశాల్లోని పరిస్థితుల అధ్యయనం ఆధారంగా హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ఈ నివేదికను తయారు చేసింది. కాగా, ఈ ప్రమాదకర వంట విధానాల నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు 2.2 బిలియన్ డాలర్లు కేటాయించినట్టు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది.