ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరంలో 58 ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలు మూతపడ్డాయి. ఈ మూసివేతలతో పాటు వివిధ సాంకేతిక విద్యాసంస్థల్లో దాదాపు 950 కి పైగా కోర్సులను కూడా రద్దు చేసినట్లు AICTE అధికారికంగా వెల్లడించింది.
ఈ కళాశాలల మూసివేతకు సంబంధించి AICTE ‘ప్రోగ్రెసివ్ క్లోజర్’ విధానాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం, 2025-26 విద్యా సంవత్సరం నుండి ఈ విద్యాసంస్థల్లో మొదటి సంవత్సరం (ఫస్ట్ ఇయర్) విద్యార్థుల అడ్మిషన్లను పూర్తిగా నిలిపివేస్తారు. అయితే.. అప్పటికే ఆయా కళాశాలల్లో చదువుతున్న పాత విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా, వారు తమ డిగ్రీలను విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు వీలుగా AICTE తగిన అనుమతులు ఇచ్చింది.
గత కొన్ని సంవత్సరాలుగా ఈ కళాశాలల్లో విద్యార్థుల చేరిక ఆశించిన స్థాయిలో లేకపోవడం, నిబంధనల ప్రకారం అవసరమైన సంఖ్యలో అర్హులైన అధ్యాపకులను నియమించలేకపోవడం మరియు మౌలిక వసతుల కల్పనలో విఫలం కావడం వంటి ప్రధాన కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విద్యాసంస్థల మూసివేతలో ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్రలు ఒక్కొక్కటి 12 కళాశాలలతో మొదటి స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో 8, తెలంగాణలో 4, పంజాబ్లో 4, ఆంధ్రప్రదేశ్లో 3 మరియు రాజస్థాన్లో 3 కళాశాలలు మూతపడ్డాయి. గుజరాత్, కర్ణాటక, తమిళనాడులలో రెండేసి చొప్పున, అలాగే హర్యానా, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కొక్క కళాశాల చొప్పున మూసివేశారు. మొత్తం 58 విద్యాసంస్థల్లో కేవలం 3 మాత్రమే ప్రభుత్వ గుర్తింపు లేదా సహాయం పొందినవి కాగా, మిగిలిన 55 కళాశాలలు ప్రైవేట్ యాజమాన్యాల కింద నడుస్తున్నవే కావడం గమనార్హం. సరైన నాణ్యత మరియు మౌలిక ప్రమాణాలు లేని కళాశాలలు దేశంలో క్రమంగా కనుమరుగవుతున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

