Pakistan: పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారం నాడు పాకిస్థాన్కు చెందిన ఒక కీలక సైనిక స్థావరంపై తమ వైమానిక దళం దాడి చేసిందని ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ‘X’ వేదికగా ఈ వివరాలను వెల్లడించింది. ఆఫ్ఘన్ దళాలు జరిపిన ఈ మెరుపు దాడిలో పాకిస్థాన్కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్ రక్షణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ దాడిలో14 మంది పాకిస్థాన్ సైనికులు మరణించగా, 11 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. దాడిలో ఒక సాయుధ ట్యాంక్, ఒక అంతర్జాతీయ రవాణా వాహనంతో పాటు సైనిక స్థావరం పూర్తిగా ధ్వంసమైంది. పాకిస్థాన్ సైనిక పాలన కొనసాగిస్తున్న అకృత్యాలకు నిరసనగానే ఈ ప్రతిదాడికి దిగినట్లు ఆఫ్ఘన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
READ ALSO: PM Modi: కాంగ్రెస్ బట్టలు చింపుకోవడం తప్పితే, చేసేదేం లేదు..
పాక్ సైనిక పోస్టు ఆక్రమణ..
కేవలం దాడులతోనే సరిపెట్టకుండా, డ్యూరాండ్ లైన్ సమీపంలోని పాకిస్థాన్ సైనిక పోస్టును కూడా తమ భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని ఆఫ్ఘనిస్థాన్ ప్రకటించింది. కునార్, నంగర్హార్ ప్రావిన్సుల తూర్పు ప్రాంతంలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా వివాదాస్పద డ్యూరాండ్ లైన్ వెంబడి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరువైపుల నుంచి మోర్టార్ కాల్పులు, వైమానిక దాడులు నిరంతరం కొనసాగుతుండటంతో సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. తాజా దాడి నేపథ్యంలో పాకిస్థాన్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతోంది.
🚨 Retaliation
In response to the crimes committed by the Pakistani military regime, Afghan Defense Forces carried out operations along the Durand Line in the eastern zone of Kunar and Nangarhar provinces. During the operation…
— د ملي دفاع وزارت – وزارت دفاع ملی (@MoDAfghanistan2) March 14, 2026
