ACB Raids: ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజ్ను అవినీతి నిరోధక శాఖ (ACB) అరెస్ట్ చేసింది. ఆయన ప్రస్తుతం వరంగల్ జిల్లా గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జయరాజ్పై అవినీతి ఆరోపణలు రావడంతో ఈ దాడులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జయరాజ్ అవినీతికి పాల్పడుతున్నారంటూ గతంలోనే గనుల శాఖ అధికారులు హెచ్చరించారు కూడా. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ తీరులో మార్పు రాలేదని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో జయరాజ్ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి సమాచారం అందడంతో దర్యాప్తు చేపట్టింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్, వరంగల్తో పాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. బోడుప్పల్లోని జయరాజ్ నివాసంతో పాటు ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. సోదాల్లో భారీగా ఆస్తులు, నగదు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ లెక్కల ప్రకారం జయరాజ్కు సంబంధించిన సుమారు రూ.65 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. బోడుప్పల్లో రెండంతస్తుల భవనం, తూప్రాన్, తుంగతుర్తి, సూర్యాపేటలో ఒక్కో ఫ్లాట్, కీసరలో రెండు ఇంటి స్థలాలు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. కేపీహెచ్బీలో విలువైన మరో ఫ్లాట్ను కూడా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
అలాగే సుమారు రూ.20 లక్షల విలువైన ఎల్ఐసీ బాండ్లు, రూ.20 లక్షలకు పైగా పోస్టాఫీస్ సేవింగ్స్, మూడు బ్యాంకు ఖాతాల్లో రూ.71 లక్షల నగదు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు సుమారు రూ.40 లక్షల విలువైన మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, 629 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక జయరాజ్ తన ఇంటి డ్రైవర్ బ్యాంకు ఖాతా నుంచి తన కుమార్తె ఖాతాలోకి రూ.24 లక్షలు బదిలీ చేయించినట్లు కూడా ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఈ లావాదేవీలపై కూడా అధికారులు విచారణ చేపట్టారు.
సోదాల్లో బయటపడిన ఆస్తులు, నగదు, బంగారం, బ్యాంకు లావాదేవీల ఆధారంగా జయరాజ్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ నిర్ధారణకు రావడంతో.. ఆయనను అరెస్ట్ చేసి వరంగల్కు తరలించారు. అనంతరం జయరాజ్ను వరంగల్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కేసును పరిశీలించిన కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఏసీబీ అధికారులు జయరాజ్ను వరంగల్ జైలుకు తరలించారు.

