Site icon NTV Telugu

Punjab Blast Mastermind: 2019 పంజాబ్‌ పేలుళ్ల సూత్రధారి అరెస్ట్

Punjab Blast

Punjab Blast

Punjab Blast Mastermind: 2019లో పంజాబ్‌లోని తరన్ తారణ్ ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడు కేసులో వాంటెడ్‌గా ఉన్న బిక్రమ్‌జిత్‌ సింగ్‌ను ఆస్ట్రియా నుంచి రప్పించి ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం అదుపులోకి తీసుకున్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు. ఇంటర్‌పోల్‌తో సమన్వయంతో ఆస్ట్రియాలో అధికారులు అతని అప్పగింత ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత బిక్రమ్‌జిత్ సింగ్ అలియాస్ బిక్కర్ పంజ్వార్ అలియాస్ బిక్కర్ బాబాను అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. వియన్నా నుంచి అతడిని రప్పించి ఢిల్లీలో అరెస్ట్ చేశారు.

పంజాబ్‌లో దాడులు చేసేందుకు బిక్రమ్‌జిత్‌సింగ్ తన సన్నిహితులతో కలిసి ఉగ్రవాద బృందాన్ని ఏర్పాటు చేశాడని, అతడిని భారత్‌కు రప్పించేందుకు ఎన్‌ఐఏ ఓ బృందాన్ని ఆస్ట్రియాకు పంపిందని అధికారి తెలిపారు. మొహాలీలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు నుంచి అతనిపై నాన్-బెయిలబుల్ వారెంట్, తదుపరి రెడ్ నోటీసును పొందిన తరువాత బిక్రమ్‌జిత్ సింగ్‌ను మార్చి 22, 2021 న లింజ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు ప్రతినిధి తెలిపారు. లీగల్ ప్రొసీడింగ్స్ పూర్తయిన తర్వాత లింజ్ రీజినల్ కోర్ట్ అతన్ని అప్పగించిందని అధికారి తెలిపారు.

ఎన్‌ఐఏ ప్రకారం.. బిక్రమ్‌జిత్‌ సింగ్ ఈ కేసులో సహ నిందితులను, ఇతరులను ఉగ్రవాద చర్యలకు ప్రేరేపించడమే కాకుండా, ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలను రూపొందించడానికి, వాటిని ఉపయోగించడంలో శిక్షణ కూడా ఇచ్చాడని దాని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. వివిధ ఊరేగింపులు, ఆందోళనల సమయంలో అతడు బాంబులను తీసుకువెళ్లాడు. ప్రజలను భయాందోళనలకు గురిచేయడానికి ప్రభుత్వ సంస్థలపై దాడి చేయడానికి ఇతరులను ప్రేరేపించాడు. డేరా మురాద్‌పురాను లక్ష్యంగా చేసుకునే కుట్రలో సింగ్ కీలక సూత్రధారి అని ఎన్‌ఐఏ తెలిపింది.

పంజాబ్‌లోని 2019 తరన్‌ తారణ్ పేలుడులో ఉగ్రవాద కుట్రలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు మరణించగా.. తొమ్మిది మంది ఖలిస్థాన్ అనుకూల వ్యక్తులపై ఎన్‌ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. చార్జిషీట్ చేయబడిన వారిలో బిక్రమ్‌జిత్ సింగ్, మాసా సింగ్, హర్జిత్ సింగ్, గుర్జంత్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ ఉన్నారు, వీరంతా తరన్ తారణ్ నివాసితులు. గురుదాస్‌పూర్‌కు చెందిన చందీప్ సింగ్, అమృత్‌సర్‌కు చెందిన మల్కిత్ సింగ్, అమర్జీత్ సింగ్‌తో పాటు ఓ మైనర్‌ ఈ దాడికి పాల్పడినట్లు వారి ఎన్‌ఐఏ అభియోగాలు నమోదు చేసింది. పాతిపెట్టిన పేలుడు పదార్థాలను వెలికి తీస్తుండగా పేలుడు సంభవించగా.. ఆ ముఠాకు చెందిన విక్రమ్‌ సింగ్‌, హర్‌ప్రీత్‌ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో వారి పేర్లను నమోదు చేయలేదు.

సెప్టెంబర్ 4, 2019 న తరన్‌ తారణ్‌లోని పండోరి గోలా గ్రామ శివార్లలోని ఖాళీ స్థలంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దాగి ఉన్న పేలుడు పదార్థాలను వెలికితీసేందుకు గొయ్యి తవ్వుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ కేసును 2019 సెప్టెంబర్ 23న ఎన్‌ఐఏ మళ్లీ నమోదు చేసింది. నిందితులు రాడికలైజ్డ్ ఖలిస్తాన్ అనుకూల యువకులని, వారు బిక్రమ్‌జిత్ సింగ్ నాయకత్వంలో ఉగ్రవాద ముఠాను ఏర్పాటు చేశారని ఎన్‌ఐఏ ప్రతినిధి తెలిపారు.

Burqa Dance Video: బురఖాలు ధరించి డ్యాన్సులు.. 4గురు విద్యార్థులు సస్పెండ్.. వీడియో వైరల్

భారత్ నుంచి పంజాబ్ విడిపోవాలని కోరుతూ సిక్కు వర్గానికి చెందిన వారిని రెచ్చగొట్టేందుకు ఉగ్రవాద ముఠా సభ్యులు మైదానంలో అలాగే సామాజిక మాధ్యమాల్లో వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడ్డారని ఎన్‌ఐఏ తన ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. వివిధ వర్గాల ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం, అశాంతి సృష్టించడం, సామాజిక, మత సామరస్యానికి భంగం కలిగించడం, తద్వారా పంజాబ్‌లో ప్రజా శాంతి భద్రతలు దెబ్బతింటాయని ఎన్‌ఐఏ ఆరోపించింది. పంజాబ్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు వారు అక్రమంగా పేలుడు పదార్థాలను సేకరించి, ముడి బాంబులను సిద్ధం చేసి పరీక్షించారని పేర్కొంది. నిందితులు తరన్‌ తారణ్‌లోని మురాద్‌పురా వద్ద డేరాను లక్ష్యంగా చేసుకుని దాడి తేదీని ఎంచుకోవడానికి ముందు వరుస రహస్య సమావేశాలు నిర్వహించారు. హర్జిత్, గుర్జంత్, విక్రమ్, హర్‌ప్రీత్‌లు పాతిపెట్టిన పేలుడు పదార్థాలను వెలికి తీస్తుండగా పేలుడు సంభవించిందని అధికారి తెలిపారు.

Exit mobile version