NTV Telugu Site icon

Crime News: డెహ్రాడూన్‌లో దారుణం.. బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం!

Girl Rape

Girl Rape

Moradabad Girl Gang Raped in Uttarakhand Bus Stand: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని అంతర్రాష్ట్ర బస్‌ టెర్మినల్‌ వద్ద ఆగి ఉన్న ఢిల్లీ- డెహ్రాడూన్‌ బస్సులో 15 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బస్టాండ్‌లోని ఓ దుకాణం కాపలాదారు బాలిక దీన స్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆగష్టు 12న చోటుచేసుకున్న ఈ ఘటనపై శనివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. సీసీటీవీ ద్వారా దారుణం చోటుచేసుకున్న ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.

ఆగష్టు 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో అంతర్రాష్ట బస్‌ టెర్మినల్‌ 12వ నంబరు ప్లాట్‌ఫాంపై ఓ బాలిక ఒంటరిగా కూర్చుని ఉంది. బాలిక దీన స్థితిని గమనించిన బస్టాండ్‌లోని ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జిల్లా శిశు సంక్షేమ కమిటీ సభ్యులు బాలికను బాలనికేతన్‌కు తరలించారు. అక్కడ కౌన్సెలింగ్‌ ఇవ్వగా.. ఆమె జరిగిన విషయం చెప్పింది. శిశు సంక్షేమ కమిటీ సభ్యురాలు ప్రతిభా జోషి శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. డెహ్రాడూన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అజయ్‌ సింగ్‌ బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు.

Also Read: Kolkata Doctor Case: ఓ వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌ చూపించినా నా తప్పే.. బాలీవుడ్‌ నటి సెలీనా జెట్లీ ఆగ్రహం!

బాలిక ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ నుంచి ఢిల్లీకి.. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బస్సు డెహ్రాడూన్‌కు చేరుకున్న తర్వాత ప్రయాణికులంతా దిగిపోయాక.. ఒంటరిగా ఉన్న బాలికపై ముందుగా డ్రైవర్, కండక్టర్‌ అత్యాచారానికి పాల్పడినట్లు అజయ్‌ సింగ్‌ చెప్పారు. ఆపై పక్కనే నిలిపి ఉంచిన బస్సుల డ్రైవర్లు ఇద్దరు, బస్టాండ్‌లోని క్యాషియర్‌ కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారన్నారు. సీసీటీవీ దృశ్యాల ద్వారా ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు.