Youth Risks Reels: మరీ ఇదేం పిచ్చిరా నాయనా..! రీల్స్ కోసం ఏకంగా..

  • రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న యువత
  • సోషల్ మీడియాలో రీల్స్, వ్యూస్, షేర్స్ కోసం ప్రమాదకరమైన స్టంట్స్
  • ఉత్తర ప్రదేశ్ లో రైల్ కింద పడుకుని వీడియో తీసుకున్న యువకుడు
Untitled Design

Untitled Design

మరీ ఇదేం పిచ్చిరా నాయనా..! రీల్స్ కోసం యువత ఏకంగా ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో రీల్స్, వ్యూస్, షేర్స్ కోసం యువత చేస్తున్న ప్రమాదకరమైన స్టంట్ లు చేస్తున్నారు. కేవలం లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఓ యువకుడు చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని కొత్వాలీ ప్రాంతానికి చెందిన అజయ్ రాజ్ బర్ అనే యువకుడు, రైలు కింద పడుకుని వీడియో చిత్రీకరించాడు. ప్రాణాలకు తెగించి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. రైల్వే భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించడం వంటి ఆరోపణలపై అజయ్ రాజ్ బర్‌ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు యువతకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం చట్ట విరుద్ధమైన, ప్రాణాపాయ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలని, భద్రతే ప్రథమ ప్రాధాన్యతగా భావించాలని యువతకు పోలీసులు సూచించారు.