యువ నటి ఆత్మహత్య… డ్రగ్సే కారణమా?

ముంబైకి చెందిన ఓ యువనటి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. భోజ్‌పురిలో ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తున్న యువనటి డిసెంబర్ 20న తన స్నేహితులతో కలిసి ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు పార్టీకి వెళ్లింది. అక్కడకు ఎన్‌సీబీ అధికారుల పేరుతో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమెను బెదిరించారు. డ్రగ్స్ కేసులో పేరు వెల్లడించకుండా ఉండాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదే పదే ఫోన్ చేసి భయపెట్టడంతో మనస్తాపానికి గురై యువనటి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Read Also: టెస్టుల్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పోలీసులు ఆ నటి పేరు వెల్లడించలేదు. నటిని బెదిరించిన నిందితులు పరదేశి (38), పర్వీన్ వాలింబే(35)ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. వారిపై సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా నటి ఆత్మహత్య ఘటనపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్​సీబీనే తమ ప్రైవేట్ ఆర్మీతో డబ్బుల కోసం మహిళను వేధించిందని విమర్శించారు. బాలీవుడ్ నటుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఎన్‌సీబీ అధికారులు ఓ ప్రైవేట్ ఆర్మీని నడుపుతున్నారని మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు.