Site icon NTV Telugu

PM Modi: నారీశక్తి బిల్లుకు అండగా ఉందాం.. దేశ ప్రజలకు మోడీ పిలుపు

Pmmodi

Pmmodi

2047 నాటికి భారత్ వికసిత్ భారత్‌గా మారాలంటే నారీశక్తిని ప్రోత్సహిస్తేనే సాధ్యమవుతుందని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. ‘‘2047 నాటికి… భారతదేశ స్వాతంత్ర్యం వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయానికి… ‘‘వికసిత్ భారత్’’ లక్ష్యాన్ని సాధించాలని భారతదేశం సంకల్పించింది. అయితే గత రెండున్నర దశాబ్దాలుగా ప్రభుత్వ అధినేతగా నాకున్న అనుభవం ఆధారంగా నేను చెప్పగలిగేది ఏమిటంటే.. మనం ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించాలంటే.. మన ‘మాతృ శక్తి’ని, మన ‘నారీ శక్తి’ని దేశాభివృద్ధిలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేయాలి.’’ అని మోడీ కోరారు.

‘‘2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మన దేశంలోని ‘నారీ శక్తి’కి లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో ప్రజా ప్రతినిధులుగా 33 శాతం ప్రాతినిధ్యం లభించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా మేము అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాము. చాలా వరకు పార్టీలు తమ మద్దతును తెలియజేశాయి. ప్రస్తుతం ఒక అత్యంత సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఈ అంశాలపై ఈ రోజు నేను వార్తాపత్రికల్లో ఒక వ్యాసం రాశాను. అందులో నా ఆలోచనలను పంచుకున్నాను. దయచేసి మీరు ఆ వ్యాసాన్ని చదవాలని.. అలాగే ఇతరులు కూడా చదివేలా ప్రోత్సహించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.’’ అని ప్రజలకు మోడీ పిలుపు నిచ్చారు.

‘‘అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలను కూడా మీరు ప్రేరేపించి ప్రోత్సహించాలి. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంటులో సమావేశమైనప్పుడు ఈ బిల్లును ఆమోదించి.. అందరం కలిసి ఆ విజయాన్ని సంబరంగా జరుపుకోగలుగుతాము.’’ అని మోడీ పేర్కొన్నారు.

Exit mobile version