Supreme Court WhatsApp Privacy: వాట్సాప్–మెటా గోప్యతా విధానంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు, భారతీయ వినియోగదారుల డేటా గోప్యతపై అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శించింది. భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని మెటాతో పంచుకోవడానికి వాట్సాప్కు అనుమతి ఇవ్వబోమని స్పష్టంగా పేర్కొంది. ఈ డేటా షేరింగ్ విధానం దేశ పౌరుల గోప్యతా హక్కులను ఉల్లంఘించే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, వాట్సాప్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ దేశ గోప్యతా విధానాలతో ఆడుకునే హక్కు మీకు లేదు. మెటాతో ఎటువంటి సమాచారాన్ని పంచుకోవడానికి మేము మిమ్మల్ని అనుమతించము అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మెటా, వాట్సాప్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) దాఖలు చేసిన మూడు ప్రధాన అప్పీళ్లను సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. ఈ అప్పీళ్లపై సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసులో విధించిన రూ.213 కోట్ల జరిమానాను మెటా చెల్లించిందని కంపెనీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.
వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త గోప్యతా విధానం అత్యంత సంక్లిష్టంగా ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ పాలసీని చదివి అర్థం చేసుకోవడం న్యాయవాదులకే కష్టం. మరి గృహ కార్మికులు, నిర్మాణ కార్మికులు, చిన్న వ్యాపారులు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? అని ప్రశ్నించారు. వినియోగదారులు యాప్కు అలవాటుపడి, దానిపై ఆధారపడే స్థితికి చేరుకున్నారని, ఆ నిస్సహాయతను వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. వినియోగదారుల డేటాను వాణిజ్య లాభం కోసం ఉపయోగించడం తీవ్రమైన విషయం. మిలియన్ల మంది భారతీయుల డేటా ఇప్పటికే దుర్వినియోగానికి గురైంది అని సీజేఐ పేర్కొన్నారు.
దీనిపై మెటా తరఫు న్యాయవాది అఖిల్ సిబల్, పరిమిత డేటా షేరింగ్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే జరుగుతోందని వాదించారు. అయితే దీనిపై స్పందించిన సీజేఐ.. డేటాలో ఏ భాగమైనా లాభదాయకమని అనిపిస్తే, దాన్ని అమ్మేస్తారా? భారతీయ వినియోగదారులు స్వరం లేనివారనే కారణంతో వారిని బలిపశువులుగా చేయలేరు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, వాట్సాప్ వినియోగదారులకు రెండు ఎంపికలే ఇస్తోందని తెలిపారు.. పాలసీని అంగీకరించాలి లేదా యాప్ వినియోగం మానేయాలి. దీనిపై కోర్టు స్పందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే, ఇంగ్లీష్ తెలియని ప్రజలు ఈ పాలసీ వల్ల కలిగే ప్రమాదాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరని పేర్కొంది. మిమ్మల్ని డేటా పంచుకోవడానికి అనుమతించాల్సిన దైవిక హక్కు ఉందని మీరు మమ్మల్ని ఒప్పించలేకపోతే, మేము అంగీకరించము అని సీజేఐ తేల్చి చెప్పారు. ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, సుప్రీం కోర్టు అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసింది. జనవరి 2025లో NCLAT ఇచ్చిన ఉత్తర్వుల స్థితి కూడా కీలకమని పేర్కొంటూ, ఈ కేసును ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు విస్తృతంగా విచారించనున్నట్లు ప్రకటించింది.
