పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురును అందించింది. ‘పశ్చిమ బెంగాల్ సర్వీసెస్ (వయోపరిమితి పెంపు) నిబంధనలు, 1981’కు కొత్త సవరణలు జారీ చేసి, వివిధ రాష్ట్ర సర్వీసులలో ప్రవేశానికి గరిష్ట వయోపరిమితిని పెంచింది. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ (ఆడిట్ బ్రాంచ్) జారీ చేసిన ఈ వయోపరిమితి పెంపు నోటిఫికేషన్ లక్షలాది నిరుద్యోగులకు కొత్త ఆశలు కలిగించింది. నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త వయోపరిమితులు
ఉత్తర్వు ప్రకారం, గ్రూప్ ఎ నియామకాలకు గరిష్ట వయోపరిమితిని ఇప్పుడు 41 సంవత్సరాలకు పెంచారు. ఇప్పటికే అధిక వయోపరిమితి ఉన్న ఏ పోస్టుకైనా ప్రస్తుత నిబంధనే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రూప్ బి పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు సవరించారు. అదే సమయంలో, గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్లకు పెంచారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చట్టబద్ధ సంస్థలు, ప్రభుత్వ కంపెనీలు, స్థానిక సంస్థలలో నియామకాల నియంత్రణ చట్టం, 1999 పరిధిలోకి వచ్చే నియామకాలలో, పబ్లిక్ సర్వీస్ కమిషన్ యంత్రాంగం వెలుపల ఎంపిక జరిగే చోట, అనుమతించబడిన గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలుగా ఉంటుందని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ మార్పులు మే 11 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయం సువేందు అధికారి నేతృత్వంలోని కొత్త బీజేపీ ప్రభుత్వం మొదటి క్యాబినెట్ సమావేశంలో తీసుకుంది. ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలలో భాగం. దశాబ్దాలుగా నియామకాలలో జాప్యం, అవకతవకాల వల్ల దెబ్బతిన్న యువతకు ఉపశమనం కలిగించడమే లక్ష్యం.
