NTV Telugu Site icon

Kolkata Doctor Case: ఆర్‌జీ కర్ మాజీ-ప్రిన్సిపాల్‌కి సన్నిహితంగా ఉన్న ముగ్గురు డాక్టర్లపై వేటు..

Kolkata Doctor Case

Kolkata Doctor Case

Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి ఘటన యావద్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యంత దారుణంగా మానభంగం చేసి, హత్య చేశారు. ఈ ఘటనలో సంజయ్ రాయ్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో మొదటి నుంచి ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ప్రవర్తన అనుమానంగా ఉంది. ముఖ్యంగా ఈ హత్యను ఆత్మహత్యగా మార్చేందుకు ప్రయత్నించారనే అభియోగాలు ఉన్నాయి.

మరోవైపు కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ని సీబీఐ పలు అవినీతి ఆరోపణల కేసుల్లో అరెస్ట్ చేసింది. తాజాగా అతనికి సన్నిహితంగా ఉండే ముగ్గురు వైద్యుల్ని పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్(డబ్ల్యూబీఎంసీ) సస్పెండ్ చేసినట్లు శనివారం ప్రకటించింది. ముగ్గురు వైద్యుల్లో బుర్ద్వాన్ మెడికల్ కాలేజ్ రేడియో డయాగ్నసిస్ విభాగానికి చెందిన మాజీ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (RMO) అవిక్ దే, అదే ఆసుపత్రి పాథాలజీ విభాగానికి అనుబంధంగా ఉన్న మాజీ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ బీరుపాక్ష బిశ్వాస్,మిడ్నాపూర్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ జూనియర్ డాక్టర్ ముస్తాఫిజుర్ రెహమాన్ మల్లిక్ ఉన్నారు.

Read Also: Sunita kejriwal: హర్యానాలో సునీతా ఎన్నికల ప్రచారం.. మోడీకి కేజ్రీవాల్ తలవంచరని వ్యాఖ్య

సందీప్ ఘోష్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని, లీడర్లతో ఉన్న లింకులను ఉపయోగించుని జూనియర్ డాక్టర్లను వేధించడం చేస్తుండేవారని తేలింది. సెప్టెంబర్ 5న, పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ రాష్ట్ర వైద్య సేవల నుండి అవిక్ దే మరియు బిస్వాస్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సస్పెన్షన్‌తో పాటు అవిక్‌పై శాఖాపరమైన విచారణను కూడా జరగనుంది. బిశ్వాస్‌ని తూర్పు బుర్ద్వాన్ జిల్లాలోని మెడికల్ కాలేజీ నుంచి దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కక్‌ద్వీప్ సబ్ డివిజనల్ ఆస్పత్రికి బదిలీ చేసిన ఒక రోజు తర్వాత సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేయబడింది.

ఆర్‌జీ కర్ వైద్యురాలి ఘటన తర్వాత సందీప్ ఘోష్‌కి సన్నిహితులైన అవిక్ దే, బిశ్వాస్‌లు జూనియర్ డాక్టర్లను, ఇంటర్న్‌లను బెదిరించే సంస్కృతిని ప్రవేశపెట్టారని పలువురు జూనియర్ డాక్టర్లు ఆరోపించారు. మల్లిక్ బిశ్వాస్‌కి వ్యతిరేకంగా మిడ్నాపూర్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్‌లోని జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపట్టారు. జూనియర్ డాక్టర్లపై బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడం కొత్తేమీ కాదని, ఈ ముగ్గురు వైద్యులపై కౌన్సిల్ చర్యలు తీసుకోవాలని, కనీసం ముందస్తుగానైనా హెచ్చరించి ఉండాల్సిందని కొందరు వైద్య సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. మరోవైపు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అవకతవకలతో సంబంధం ఉన్నందున ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సందీప్ ఘోష్‌కి మెడికల్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో షోకాజ్ నోటీసుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుంటే అతడి రిజిస్ట్రేషన్ రద్దు చేయవచ్చు.