West Bengal: బెంగాల్‌లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..

  • కౌంటింగ్‌కు ముందు కోల్‌కతాలో టీఎంసీ హైడ్రామా..
  • స్ట్రాంగ్ రూం ముందు టీఎంసీ నేతల ఆందోళన..
  • బీజేపీ బ్యాలెట్ తెరిచేందుకు యత్నించిందని ఆరోపణ..
Mamata Banerjee

Mamata Banerjee

West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాతి రోజే హైడ్రామా చోటుచేసుకుంది. ఒక వైపు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ ఈసారి గెలుస్తుందని జోస్యం చెబుతున్న తరుణంలో, మరోవైపు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) బెంగాల్‌లో హైడ్రామాకు తెరతీసింది. కోల్‌కతాలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం ముందు టీఎంసీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ ఆరోపించారు. బీజేపీ బ్యాలెట్ బాక్సుల్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిందని అన్నారు.

టీఎంసీ నేతలు శశి పంజా, కునాల్ ఘోష్ స్ట్రాంగ్ రూమ్ ముందు ధర్నాకు దిగారు. తమ ప్రతినిధులు లేకుండానే బాక్సులు తెరిచేందుకు బీజేపీ, ఎన్నికల సంఘం అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. లోపల కొందరు వ్యక్తులు పని చేస్తున్నట్లు మాకు సీసీటీవీ కెమెరాల్లో కనిపించిందని, మమ్మల్ని లోపలికి అనుమతించడం లేదని వారు అన్నారు.

Read Also: Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

దీనికి ముందు, సీఎం మమతా బెనర్జీ 9 నిమిషాల వీడియోను ఎక్స్‌లో షేర్ చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంతా వట్టిదే అని, అవన్నీ బీజేపీ దిశానిర్దేశంతోనే నడుస్తున్నాయని ఆరోపించారు. తాము 220కి పైగా సీట్లలో గెలువబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. అయితే, కౌంటింగ్‌లో బీజేపీ గందరగోళం సృష్టించే అవకాశం ఉందని, టీఎంసీ కార్యకర్తలు, నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉంటే, కోల్‌కతా స్ట్రాంగ్ రూం ఆందోళనకు మరికాసేపట్లో మమతా బెనర్జీ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.