Russian Oil: అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రష్యా ముడిచమురు (క్రూడాయిల్) కొనుగోళ్లపై విధించిన ఆంక్షల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం అనూహ్యంగా యు-టర్న్ తీసుకుంది. సముద్ర మార్గంలో రవాణా అయ్యే రష్యా ముడిచమురు కొనుగోళ్లపై ఉన్న ఆంక్షల మినహాయింపును పొడిగిస్తూ ట్రంప్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మే 16తో ముగిసిన ఈ గడువు రెండు రోజులకే అమెరికా పొడిగింపును ప్రకటించడం గమనార్హం. అంతకుముందు అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న చమురు ధరలను నియంత్రించేందుకు ట్రంప్ ప్రభుత్వం మార్చిలో మొదటిసారి ఈ ఆంక్షలకు మినహాయింపును ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.
“ప్రస్తుతం సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురును ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్న దేశాలు తాత్కాలికంగా కొనుగోలు చేసేందుకు వీలుగా అమెరికా ఆర్థిక శాఖ 30 రోజుల తాత్కాలిక జనరల్ లైసెన్స్ను జారీ చేస్తోంది. ఈ గడువు పొడిగింపు ఆయా దేశాలకు అదనపు వెసులుబాటును ఇస్తుంది. అవసరమైన దేశాలకు ప్రత్యేక లైసెన్సులు ఇచ్చేందుకు మేము వారితో కలిసి పని చేస్తాము. ఈ నిర్ణయం క్రూడాయిల్ మార్కెట్ స్థిరీకరణకు సహాయపడుతుంది” అని ఆయన తన పోస్ట్లో రాసుకొచ్చారు. తక్కువ ధరకు లభించే రష్యా చమురును చైనా పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోకుండా అడ్డుకోడానికి, నిజంగా అవసరమైన దేశాలకు చమురు సరఫరాను మళ్లించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
.@USTreasury is issuing a temporary 30-day general license to provide the most vulnerable nations with the ability to temporarily access Russian oil currently stranded at sea.
This extension will provide additional flexibility, and we will work with these nations to provide…
— Treasury Secretary Scott Bessent (@SecScottBessent) May 18, 2026
అమెరికా ఆంక్షలతో మాకు సంబంధం లేదు: భారత్
అమెరికా ఈ నిర్ణయం ప్రకటించడానికి కొద్ది గంటల ముందే భారత చమురు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ న్యూఢిల్లీలో ఒక మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆంక్షల మినహాయింపు ఉన్నా లేకపోయినా.. భారతదేశం తన సొంత ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాల ఆధారంగా రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను కొనసాగిస్తూనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. “అమెరికా మినహాయింపుల విషయంలో నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. భారత్ ఈ మినహాయింపు రాకముందు, అది అమలులో ఉన్నప్పుడు, అది ముగిసిన తర్వాత కూడా రష్యా చమురును కొనుగోలు చేస్తూనే ఉంది. మా నిర్ణయాలు పూర్తిగా వాణిజ్య పరమైనవి, అలాగే దేశ ఇంధన అవసరాల భద్రతపై ఆధారపడి ఉంటాయి” అని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా దేశానికి సరిపడా ముడిచమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని, కాబట్టి అమెరికా ఆంక్షల స్థితిగతుల వల్ల భారతదేశానికి వచ్చే చమురు సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆమె నొక్కి చెప్పారు.
గత రెండు నెలలుగా అమెరికా ఆంక్షల మినహాయింపు అందుబాటులో ఉండటంతో, భారత్ – రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లను పెంచింది. కొన్ని సంవత్సరాల క్రితం రష్యా భారీ డిస్కౌంట్ ఇచ్చిన సమయంలో భారత్ ఏ స్థాయిలో చమురు దిగుమతి చేసుకుందో, ఇప్పుడు మళ్లీ దిగుమతిలో అదే స్థాయికి చేరుకుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో రష్యా చమురు కొంత ప్రీమియం ధరకు లభిస్తున్నప్పటికీ.. అమెరికా ఆంక్షల భయం లేకపోవడం వల్ల భారత ప్రభుత్వ – ప్రైవేట్ చమురు శుద్ధి కర్మాగారాలకు ఇది ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లోని ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ మార్గంలో చమురు సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో, అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయం భారత్కు మరింత కలిసి రానుందని విశ్లేషకులు చెబుతున్నారు.
