బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఊహించని షాకిచ్చారు. రాజ్యసభకు వెళ్తున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా బాంబ్ పేల్చారు. దీంతో బీహార్తో పాటు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాలా వేగంగా రాజకీయాలు మారిపోయాయి. ఇక గురువారం రాజ్యసభకు నితీష్ కుమార్ నామినేషన్ దాఖలు చేసేశారు.
నితీష్ కుమార్ అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లిపోవడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి ముఖ్యమంత్రి పీఠం బీజేపీకే దక్కుతుందని జేడీయూ వర్గాలు తెలిపాయి. రెండు ఉపముఖ్యమంత్రి పదవులు మాత్రం జేడీయూకు దక్కుతాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే ముఖ్యమంత్రి రేసులోకి కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ ముందు వరుసలోకి వచ్చారు. బీహార్ తదుపరి ముఖ్యమంత్రి నిత్యానంద్ రాయ్ కావడం ఖాయంగా బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. బీజేపీలో నిత్యానంద్ రాయ్ చాలా సీనియర్ నేతగా ఉన్నారు. అమిత్ షాతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయన ఆశీస్సులు చాలా మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిత్యానంద్ రాయ్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం నిత్యానంద్ రాయ్.. కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఉజియార్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అంతకముందు 2000 సంవత్సరం నుంచి హాజీపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ సీటు. గతంలో బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం నిత్యానంద్ రాయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వైశాలి జిల్లాలోని కర్ణపుర గ్రామంలోని నిత్యానంద రాయ్ పూర్వీకుల ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారు. హోలీ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా సంబరాలు చేసుకుంటుండంతో చర్చల్లోకి వచ్చింది
మరోవైపు సామ్రాట్ చౌదరి కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీహార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే తొలిసారి బీహార్లో బీజేపీ సీఎం పీఠాన్ని అధిరోహిస్తున్న నేపథ్యంలో అణగారిన వర్గాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిత్యానంద్ రాయ్ వైపు హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. నితీష్ వారసుడు ఎవరో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.