భూమి నిశ్శబ్దంగా రగిలిపోతోంది. ప్రకృతి తన సహనాన్ని కోల్పోతూ మానవాళికి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇందుకు తాజాగా జరిగిన నేపాల్-టిబెట్ విపత్తే ఉదాహరణ. పారిశ్రామిక విప్లవానికి ముందు రోజులతో పోలిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరగడం వల్లే ఇలాంటి విపత్తులకు కారణమని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. అయితే, ఇది ఇంతటితో ఆగదని, మున్ముందు మరిన్ని విపత్తులను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించింది. అన్నిటికంటే ముఖ్యంగా, మిగిలిన దేశాలతో పోల్చితే భారతదేశం ఎదుర్కోబోయే విపత్తులకు సంబంధించిన సమాచారం ఆందోళన కలిగిస్తోంది.
ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం-UNEP ‘లిమిటింగ్ ఓవర్షూట్’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో అనేక సంచలన విషయాలు దాగి ఉన్నాయి. భారతదేశ జనాభాలో దాదాపు 80 శాతానికి పైగా ప్రజలు విపరీతమైన ఎండలు, అనూహ్య వరదలు, కరువులు, తుఫానుల వంటి వాతావరణ ఆధారిత విపత్తులు పొంచి ఉన్న జిల్లాల్లోనే నివసిస్తున్నారు. 2026 నాటి తాజా పరిశోధనల ప్రకారం, 1981 నుంచి 2020 మధ్యకాలంలో భారతదేశ సగటు వేసవి గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ మేర పెరిగింది.
హీట్వేవ్ల సంఖ్య, వాటి తీవ్రత, అవి కొనసాగే సమయం విపరీతంగా పెరిగిపోయాయి. మానవ శరీరం తనంతట తానుగా చల్లబరుచుకోలేని అత్యంత ప్రమాదకరమైన ఉక్కపోత పరిస్థితి ఇప్పుడు దేశమంతటా వ్యాపిస్తోందని మరో నివేదిక వెల్లడించింది. ఇది కేవలం ఎండకాలానికే పరిమితం కాకుండా, వర్షాకాలంలోనూ మానవ సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని నిర్దాక్షిణ్యంగా దెబ్బతీస్తోంది.
ఉష్ణోగ్రత పెరుగుదల నేరుగా ఆహార, నీటి భద్రతలను తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది. గ్రీన్హౌస్ ఉద్గారాల పెరుగుదల కారణంగా సంభవించే వాతావరణ మార్పులు ఎల్నినో ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయని ఇటీవలి పరిశోధనలు స్పష్టం చేశాయి. ఎల్ నినో ప్రభావం భారత రుతుపవనాలపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి వర్షపాతాన్ని అస్తవ్యస్తం చేయడం ద్వారా కరువు ముప్పును మరింత పెంచుతోంది. మరోవైపు దేశ జీవనదులైన సింధు, గంగా, బ్రహ్మపుత్ర వంటి నదుల మనుగడ హిందూకుష్ హిమాలయాలపై ఆధారపడి ఉంది.
అయితే, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ 2026 ప్రారంభంలో విడుదల చేసిన డేటా అత్యంత భయానకమైన వాస్తవాన్ని వెల్లడించింది. 2000 సంవత్సరం నుండి ఇప్పటివరకు హిమాలయ ప్రాంతంలో హిమానీనదాలు కరిగిపోయే వేగం రెట్టింపు అయింది. ఈ ఆకస్మిక కరుగుదల నదీ లోయల్లో ఆకస్మిక వరదలకు, కొండచరియలు విరిగిపడటానికి దారితీయడమే కాక, భవిష్యత్తులో కోట్ల మంది ప్రజలను తీవ్ర నీటి ఎద్దడిలోకి నెట్టే ప్రమాదం ఉంది.
ఈ విపత్తుల వెనుక అభివృద్ధి చెందిన దేశాల అన్యాయం స్పష్టంగా దాగి ఉంది. ఇటీవల పొరుగు దేశమైన నేపాల్లో వాతావరణ విలయాల కారణంగా వెయ్యి మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడమే దీనికి నిదర్శనం.
ప్రపంచ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో నేపాల్ వంటి దేశాల పాత్ర నామమాత్రమే. కానీ, అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు దశాబ్దాలుగా సాగించిన పారిశ్రామిక విధ్వంసానికి మూల్యం మాత్రం ఏ పాపం ఎరుగని గ్లోబల్ సౌత్ దేశాలే చెల్లించాల్సి వస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలు ఉద్గారాల తగ్గించడంతో పాటు నష్టపరిహారం, వాతావరణ ఆర్థిక సహాయం తప్పనిసరిగా చేయాలని బ్రెజిల్లో జరిగిన COP30 సదస్సులో భారత్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది నవంబర్లో టర్కీలో జరగనున్న COP31 సదస్సు కీలకంగా మారింది.
ప్రకృతి విసురుతున్న ఈ సవాలును తీరిగ్గా కూర్చుని సరిదిద్దుకునేంత సమయం లేదు. ఒకటిన్నర డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితేనే, ఈ స్థాయిలో ప్రభావం ఉంటుందని అర్థమైనప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఉష్ణోగ్రత పెరుగుదలలో నివారించగలిగే ప్రతి చిన్న అంకె కూడా భవిష్యత్తులో వేలాది ప్రాణాలను, కోట్ల ఎకరాల పంటలను, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుతుంది. ఇదే ఇప్పుడు మన ముందున్న అత్యంత ప్రాధాన్యతా అంశం.
:- CLN RAJU (EDITOR- NTV DIGITAL)

