Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో

  • తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్
  • వెలుగులోకి వీడియో
  • సంచలనంగా మారిన కేసు
Twisha Sharma3

Twisha Sharma3

తెలుగు హీరోయిన్ ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమె మరణానికి ముందు ఏం జరిగిందో.. అందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. మరణానికి ముందు ట్విషా శర్మ ఇంటి మెట్లపైకి వెళ్లింది. కొద్దిసేపటికే ఆమె శవాన్ని భర్తతో పాటు మరొకరు కిందకు తీసుకొచ్చారు. వీడియో బయటకు రావడంతో కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలోని అత్తింట్లో ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది.

ట్విషా శర్మ ఇంటి టెర్రస్ వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అనంతరం ఆమెను కాపాడేందుకు కనీసం ముగ్గురు వ్యక్తులు CPR ఇవ్వడానికి ప్రయత్నించినట్లు వీడియోలో ఉంది. వీరిలో ఆమె భర్త సమర్థ్ సింగ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు సార్లు CPR ప్రయత్నాలు విఫలమైన తర్వాత ట్విషా మృతదేహాన్ని మెట్లదారిలో కిందికి తీసుకెళ్లిన దృశ్యాలు కూడా వీడియోలో కనిపించాయి. ఆ సమయంలో అత్త గిరిబాలా సింగ్ కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.

మే 12న భోపాల్‌లోని భర్త ఇంట్లో ట్విషా శర్మ మృతి చెందింది. ప్రస్తుతం ఆమె భర్త సమర్థ్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతనిపై, అతని తల్లి గిరిబాలా సింగ్‌పై పోలీసులు వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం కేసులు నమోదు చేశారు. గిరిబాలా సింగ్ రిటైర్డ్ జడ్జి కావడం గమనార్హం. పోలీసుల సమాచారం ప్రకారం ట్విషా శర్మ.. సమర్థ్ సింగ్ 2024లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యారు. అనంతరం 2025 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు.

ఇక సమర్థ్ సింగ్ తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్‌లో ట్విషా శర్మ డ్రగ్స్‌కు బానిసైందని, మానసిక చికిత్స కూడా తీసుకుంటోందని పేర్కొనడం మరింత వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే గిరిబాలా సింగ్‌కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం మధ్యప్రదేశ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేశారు. SIT అధిపతి, మిస్రోడ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజ్‌నీష్ కశ్యప్ మాట్లాడుతూ.. సమర్థ్ సింగ్ కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.

భోపాల్ ఎయిమ్స్ విడుదల చేసిన ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక ప్రకారం ట్విషా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అయితే ట్విషా కుటుంబం మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తూ న్యాయం కోసం పోరాడుతోంది. ఇక బెయిల్ పిటిషన్‌లో ట్విషా డ్రగ్స్ తీసుకోలేని సమయంలో చిరాకు, చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపించేవని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై SIT అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తోంది.