దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానంలో తీవ్ర గందరగోళం నెలకొంది. న్యాయమూర్తి ఎదుట ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా భర్త సమర్థ్సింగ్ను ట్విషా లాయర్ చెంపపై కొట్టడంపై అత్తగారు గిరిబాలాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఘటనలో రెండు వర్గాలు శారీరికంగా కొట్టుకున్నట్లు సమాచారం.
ట్విషా శర్మ కేసులో నిందితులుగా ఉన్న భర్త సమర్థ్సింగ్, అత్త గారు గిరిబాలాసింగ్కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అనంతరం సీబీఐ రిమాండ్ ముగిసిన తర్వాత నిందితులను మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో రెండు వర్గాల మధ్య శారీరక ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. తన కొడుకును ట్విషా శర్మ లాయర్ చెంపదెబ్బ కొట్టడమేంటి? అని గిరిబాలాసింగ్ నినాదాలు చేసింది. పలుమార్లు ఆమె తీవ్ర ఆగ్రహంతో కేకలు వేసినట్లుగా సమాచారం. సీసీటీవీ ఫుటేజీకి సంబంధించి.. ఆ ఫుటేజీని ఎవరు తొలగించారో తనకు తెలియదని పేర్కొన్నారని సమాచారం. విచారణ అనంతరం ఇద్దరికీ జూన్ 16వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది.
గిరిబాల సింగ్ ఆరోపణలతో ట్విషా న్యాయవాది అనురాగ్ శ్రీవాస్తవ తీవ్ర ఆగ్రహానికి గురవడంతో.. ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. న్యాయమూర్తి ఎదుట కోర్టు గదిలో తోపులాట చెలరేగడంతో ట్విషా న్యాయవాది గిరిబాలను.. ‘‘చెంపదెబ్బ ఆరోపణకు సంబంధించి ఫిర్యాదు ఎక్కడ ఉంది?.’’ అని ప్రశ్నించారు. సమర్థ్సింగ్పై రూ.30,000 రివార్డ్ ఉన్న వ్యక్తికి జబల్పూర్ ప్రధాన సెషన్స్ జడ్జి ఎలా ఆశ్రయం కల్పించారనే దానిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనికి సమర్థ్ న్యాయవాది స్పందిస్తూ.. అతనికి ఆశ్రయం కోరే హక్కు ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గిరిబాలాసింగ్ స్పందిస్తూ.. తమపై మీడియా విచారణను ఆపాలని.. మా ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆరోపించారు. ‘‘మేము ఎక్కడికి వెళ్లినా మీడియా వస్తోంది. దీనిని ఆపాలి.’’ అని కోరారు. ఇక సోమవారం నిర్వహించిన సంఘటనా స్థల పునఃసృష్టికి సంబంధించిన ఫుటేజీని మీడియా పంచుకోవడాన్ని కూడా గిరిబాల అభ్యంతరం తెలిపారు . అంతేకాకుండా సీబీఐ అధికారులు కారులో ఇంటికి వచ్చినప్పుడు.. మూడు ఇళ్ల దూరంలో దింపి.. ఆ తర్వాత కాలినడకన ఇంటికి తీసుకువచ్చారని ఆరోపించారు. కారును తన ఇంటి ముందు పార్క్ చేసి ఉండవచ్చు కదా? అని అడిగారు.
ఇద్దరూ సెంట్రల్ జైలులోనే
తాము ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ కోరుతున్నామని.. అవసరమైతే పీఆర్ (పోలీస్ రిమాండ్) కూడా కోరతామని కోర్టుకు సీబీఐ తెలిపింది. దర్యాప్తు సంస్థ తనకు తానుగా రిమాండ్ కోరలేదు. కోర్టు ఇప్పుడు ఆ ఇద్దరినీ జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. వారిని భోపాల్ సెంట్రల్ జైలులో ఇతర ఖైదీల నుంచి వేరుగా ఉంచుతారు.
మే 12న ట్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ కేసులో ఆమె భర్త, అత్తపై వరకట్నం, మరణ కేసు నమోదు చేయగా.. హైకోర్టు అనుమతి తర్వాత రెండో పోస్ట్మార్టం నిర్వహించారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. హైకోర్టు గిరిబాలాసింగ్ ముందస్తు బెయిల్ను రద్దు చేయడంతో.. సీబీఐ మే 28న గిరిబాల సింగ్ను అరెస్టు చేసింది. సమర్థ్ అప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్నాడు. అయితే ట్విషా మరణం తర్వాత 10 రోజుల పాటు పరారీలో ఉన్న నిందితుడైన భర్తను మే 22న అరెస్టు చేశారు. గిరిబాల సింగ్ జూలై 15, 2021 నుంచి ఫిబ్రవరి 28, 2023 వరకు భోపాల్ జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు.
