Aman Jaiswal: విషాదం.. రోడ్డుప్రమాదంలో టీవీ నటుడు అకాల మరణం

  • ముంబైలో ఘోర విషాదం
  • రోడ్డుప్రమాదంలో టీవీ నటుడు అమన్ జైస్వాల్ అకాల మరణం
Amanjaiswal

Amanjaiswal

ముంబైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. 22 ఏళ్ల టీవీ నటుడు అమన్ జైస్వాల్ రోడ్డు ప్రమాదంలో తుది శ్వాస విడిచాడు. ధర్తీపుత్ర నందిని అనే సీరియల్‌లో అమన్ జైస్వాల్‌కు మంచి పేరు వచ్చింది. శుక్రవారం జరిగిన ప్రమాదంలో అకాల మరణం చెందాడు. దీంతో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమన్ జైస్వాల్ మరణాన్ని రచయిత ధీరజ్ మిశ్రా ధృవీకరించారు. ఇది దురదృష్టకరమైన వార్త అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

అమన్ జైస్వాల్… ఒక ఆడిషన్‌కు కోసం జోగేశ్వరి హైవేపై బైక్‌పై వెళ్తుండగా ట్రక్కు బలంగా ఢీకొట్టింది. దీంతో గాయాలు కావడంతో కామా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన అరగంటలోనే ప్రాణాలు కోల్పోయాడు. అమన్ జైస్వాల్ స్నేహితుడు అభినేష్ మిశ్రా ఈ విషయాన్ని వెల్లడించాడు.

అమన్ జైస్వాల్ అకాల మరణం పట్ల స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మంచి భవిష్యత్ ఉన్న నటుడు అకాల మరణం చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

అమన్ జైస్వాల్.. ఉత్తరప్రదేశ్‌లోని బలియా ప్రాంతానికి చెందిన వాసి. ధర్తీపుత్ర నందిని అనే సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. సోనీ టీవీ షో నిర్వహించిన పుణ్యశ్లోక్ అహల్యాబాయిలో యశ్వంత్ రావ్ ఫాన్సే పాత్రను అమన్ జైస్వాల్ పోషించాడు. ఈ కార్యక్రమం జనవరి 2021 నుంచి అక్టోబర్ 2023 వరకు ప్రసారం చేయబడింది. జైస్వాల్.. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పుడిప్పుడే నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఇంతలోనే అతడికి నిండు నూరేళ్లు నిండిపోయాయి.