Trinamool MLA makes indecent comment about women: వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకెక్కే టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల అనుచితంగా మాట్లాడారు. భారత సంస్కృతిలో ఒక భార్యను ఐదుగురు పురుషులు పంచుకోవచ్చంటూ.. మహాభారతంలోని ద్రౌపదిని పరోక్షంగా ప్రస్తావించారు. దీంతో.. రాజకీయ వర్గాల్లో ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలుపై ఇటీవల సమీక్ష నిర్వహించిన కేంద్ర విద్యా శాఖ బృందం.. ఇందులో అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించింది. ఐదుగురు వంట సిబ్బందికి కేటాయిస్తున్న నిధుల్ని.. ప్రభుత్వం ఏడుగురికి ఇస్తున్నట్లు పసిగట్టింది. దీనిపై మదన్ మిత్రా వ్యంగ్యంగా స్పందిస్తూ.. భారత సంస్కృతిలో ఒకే భార్యను ఐదుగురు పురుషులు కలిపి పంచుకుంటారని అన్నారు.
Kishan Reddy: తెలుగు రాష్ట్రాలపై వివక్ష లేదు.. తిప్పికొట్టిన కేంద్రమంత్రి
ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. టీఎంసీ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తుందో.. మదన్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అంటూ బీజేపీ ఎమ్మెల్యే, నటి అగ్నిమిత్ర పాల్ మండిపడ్డారు. ఇలాంటి వాళ్లే టీఎంసీ పార్టీలో ఉండటం వల్ల.. వాళ్లు అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కేవలం అగ్నిమిత్ర పాల్ మాత్రమే కాదు.. సొంత టీఎంపీ పార్టీ కూడా మదన్ మిత్రా వ్యాఖ్యలను తప్పుబట్టింది. పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు.. చాలా జాగ్రత్తగా మాట్లాడాలని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సూచించారు. మిత్రా వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, భారత ఇతిహాసాల గురించి తప్పుగా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు.. మహిళా సంఘాలు సైతం మదన్ మిత్రా వ్యాఖ్యలు మహిళలు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, ఇందుకు ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి.