Deepfake video: సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన కేంద్ర ఐటీ మంత్రి..

Deepfake Video

Deepfake Video

Deepfake video: ఇటీవల కాలంలో దేశంలో ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలో ఆందోళన కలిగిస్తు్న్నాయి. ఏఐ టెక్నాలజీ సాయంతో వీడియోలను మార్ఫింగ్ చేస్తున్నారు. గతంలో రష్మికా మందన్న, కత్రినా కైఫ్, కాజోల్ వంటి మూవీ స్టార్స్ డీప్‌ఫేక్‌కి బారినపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా క్రికెట్ స్టార్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా డీప్‌ఫేక్ బాధితుడయ్యారు. సచిన్ ఆన్‌లైన్ గేమ్‌ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వాయిస్‌తో ఓ వీడియో వైరల్ అవుతోంది. డీప్‌పేక్ టెక్నాలజీతో ఈ వీడియోను రూపొందించారు. దీనిపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు అనుగుణంగా ఉండేలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టం కింద కఠినమైన నిబంధనలకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

Read Also: Viral News: గర్ల్ ఫ్రెండ్ కోసం అలాంటి పని చేసి అడ్డంగా దొరికిన యువకుడు.. అయ్యో ఎంత పనైంది..

కేంద్రం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్ ద్వారా స్పందించారు. వీడియోను గురించి చెప్పినందుకు సచిన్ టెండూల్కర్‌కి ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన డీప్‌ఫేక్‌లు మరియు తప్పుడు సమాచారం భారతీయ వినియోగదారుల భద్రత మరియు విశ్వాసానికి ముప్పు అని కూడా ఆయన అన్నారు. డీప్‌ఫేక్, తప్పుడు సమాచారం భారతీయ వినియోగదారుల భద్రత, నమ్మకానికి హని కలిగిస్తుందని, చట్టపరమైన ఉల్లంఘనలకు దారితీస్తుందని, ఇది నిరోధించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌కి సూచించారు. ఐటీ చట్టం కింద కఠిన నిబంధనలను త్వరలో తెలియజేస్తామని ఆయన ట్వీట్ చేశారు.

డీప్‌ఫేక్ వీడియోపై స్పందిస్తూ.. ఈ వీడియో నకిలీదని ఈ రకంగా సాంకేతికతను దుర్వినియోగం చేయడం తప్పు, మీరు అలాంటి వీడియోలు, యాప్‌లు లేదా ప్రకటనలు చూసినట్లైతే వాటిని వెంటనే నివేదించాలని ఎక్స్(ట్విట్టర్)లో కోరారు. గతంలో రష్మికా మందన్న డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ టెక్నాలజీపై సెలబ్రెటీలు ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఇలాంటివి ఆందోళనకరమని అన్నారు. ఐటీ చట్టంలో కఠిన నిబంధనలు తీసుకురావాలని కోరారు.