జీవనోపాధికోసం అడవికి వెళ్లిన మహిళలకు వారి జీవితాలు అక్కడే ముగిసిపోతాయని ఊహించలేదు. తునికాకు సేకరించేందుకు వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సిందేవాహి తహసీల్లోని గుంజవాహి ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ దారుణ సంఘటన జరిగింది. అడవిలో మాటువేసి ఉన్న ఒక పులి, తునికాకులు ఏరుకోవడానికి వెళ్లిన నలుగురు మహిళలపై ఘోరంగా దాడి చేసి వారిని చంపేసింది.
నివేదికల ప్రకారం, గుంజవాహి గ్రామానికి చెందిన ఈ మహిళలు, ఎప్పటిలాగే తునికి ఆకులను సేకరించడానికి ఈ ఉదయం గ్రామానికి సమీపంలోని దట్టమైన అడవికి వెళ్లారు. ఆ మహిళలు పనిలో నిమగ్నమై ఉండగా, పొదల్లో నక్కి ఉన్న పులి అకస్మాత్తుగా వారిపై దాడి చేసింది. ఆ పులి ఆ నలుగురు మహిళలను గాయపరిచి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే, స్థానిక పోలీసు, అటవీ శాఖ ఉన్నతాధికారులు భారీ భద్రతా బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని, తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. పులిదాడిలో ప్రాణాలు కోల్పోయిన మహిళల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
