NTV Telugu Site icon

Manipur Violence: కశ్మీర్‌ కంటే మణిపూర్‌లో దారుణ పరిస్థితులు.. సాయం చేయడానికి సిద్ధమన్న అమెరికా రాయబారి

Manipur

Manipur

Manipur Violence: మణిపూర్‌లో పరిస్థితులు ఇంకా సద్దుమణగ లేదు. రెండు జాతుల మధ్య మే 2న ప్రారంభమైన రావణకాష్టం ఇంకా కాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మణిపూర్‌లో పరిస్థితులు జమ్ము కశ్మీర్‌, పంజాబ్‌ కంటే దారుణంగా ఉన్నాయి. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై ఇండియాలో ఉన్న అమెరికా రాయబారి స్పందించారు. మణిపూర్‌లో పరిస్థితులను చక్కదిద్దే విషయంలో భారత్‌ కోరితే.. ఏ రూపంలోనైనా సహకరించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. అయితే ఇది భారత్‌ అంతర్గత విషయమని పేర్కొన్నారు.

Read also: Supreme Court: వివాహేతర సంబంధాల రుజువుకు కాల్ రికార్డ్.. గోప్యత హక్కును ఉల్లంఘిస్తుందా..?

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి, శుక్రవారం బిష్ణుపూర్‌ జిల్లా కంగ్‌వాయి ఏరియాలోని గ్రామాల్లో రెండు కమ్యూనిటీల మధ్య కాల్పులు చోటుచేసుకొన్నాయి. ఈ ఘటనల్లో నలుగురు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో పోలీసు కమాండో, టీనేజర్‌ ఉన్నారు. కొండ ప్రాంతాల నుంచి కొంతమంది కిందకు వచ్చి, లోయలోని పలు గ్రామాలను తగులబెట్టేందుకు ప్రయత్నించారని, వెనక్కు వెళ్లిపోవాలని స్థానికులు కోరినప్పటికీ పట్టించుకోలేదని అధికారులు తెలిపారు. అయితే ఏ ఇంటికీ నిప్పంటించకుండా భద్రతా బలగాలు నియంత్రించగలినట్టు చెప్పిన అధికారులు.. రెండు గ్రూపులకు చెందిన వారు కాల్పులకు దిగారని తెలిపారు.

Read also: Spain Floods: స్పెయిన్‌లో వరద బీభత్సం.. బొమ్మల్లా కొట్టుకుపోతున్న కార్లు

జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌లలో గతంలో జరిగిన తారాస్థాయి ఘర్షణల కంటే మణిపూర్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆ రాష్ట్ర మాజీ గవర్నర్‌ గుర్బచన్‌ జగత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్లపై దాడులు జరుగుతున్నాయని.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి లూటీకి గురైందని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, ఢిల్లీ, గుజరాత్‌ వంటి రాష్ర్టాల్లో చోటుచేసుకొన్న విపత్కర సమయాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగలేదని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలతో ఆయన ఓ వార్తాపత్రికలో ఆర్టికల్‌ రాశారు. ఆయన గతంలో జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌లలో ఐపీఎస్‌ అధికారిగా కూడా పనిచేశారు. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా మణిపూర్‌లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్ర పౌరులు సొంత దేశంలోనే శరణార్థులుగా బతకాల్సి వస్తున్నదని సీపీఐ ఎంపీ బినోయ్‌ విశ్వం ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌ పరిస్థితులపై అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి స్పందించారు. కోల్‌కతాలో మీడియా అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ మణిపూర్‌లో పరిస్థితులను చక్కదిద్దే విషయంలో భారత్‌ కోరితే.. ఏ రూపంలోనైనా సహకరించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. అయితే ఇది భారత్‌ అంతర్గత విషయం అని పేర్కొంటూనే.. శాంతి లేకుండా ఈశాన్యంలో పురోగతి సాధ్యం కాదన్నారు. అమెరికా స్పందనపై కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ ఘాటుగా స్పందించారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయం జీవితంలో, భారత అంతర్గత విషయాల్లో ఒక అమెరికా రాయబారి మాట్లాడటం చూడలేదన్నారు. అమెరికా రాయబారి అలా మాట్లాడటం సరైంది కాదని మండిపడ్డారు.