The Lalit Hotel: దేశ రాజధానిలోని బారాఖంబా లేన్లో ఉన్న ఐకానిక్ హోటల్ ‘ద లలిత్’ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ హోటల్ నడుపుతున్న భారత్ హోటల్స్ లిమిటెడ్ లైసెన్స్ను రద్దు చేస్తూ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఏప్రిల్ 22, 2026న వెలువడిన ఈ తీర్పు హోటల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అసలు ఏం జరిగిందంటే.. ఈ వివాదానికి మూలం 6.0485 ఎకరాల ప్రభుత్వ భూమి. 1982లో ఎన్డీఎంసీ – భారత్ హోటల్స్ లిమిటెడ్ మధ్య 99 ఏళ్ల లైసెన్స్ ఒప్పందం కుదిరింది. అయితే ఒప్పందం ప్రకారం 33 ఏళ్ల తర్వాత లైసెన్స్ ఫీజును సవరించే అధికారం ప్రభుత్వానికి ఉంది. దీని ప్రకారం.. పెరిగిన అద్దె, బకాయిల కింద రూ.1,063.74 కోట్లు చెల్లించాలని 2020లో ఎన్డీఎంసీ నోటీసు ఇచ్చింది. ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో లైసెన్స్ను రద్దు చేసింది.
ఈ కేసును విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ (చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు) ఎన్డీఎంసీ నిర్ణయం సరైనదేనని తేల్చింది. రాజధానిలో భూమి పరిమితమైన, అత్యంత విలువైన వనరు అని, ప్రభుత్వ సంస్థకు నష్టం కలిగేలా ఏ ఒప్పందం కొనసాగకూడదని కోర్టు స్పష్టం చేసింది. హోటల్ ప్రాంగణంలోని కమర్షియల్ స్పేస్ను సబ్-లైసెన్స్కు ఇవ్వడం కూడా నిబంధనలకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. ప్రముఖ పారిశ్రామికవేత్త లలిత్ సూరి 1980వ దశకంలో ఈ హోటల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1988లో 444 గదులతో ప్రారంభమైన ఈ హోటల్, దేశవ్యాప్తంగా గోవా, ముంబై, బెంగళూరు వంటి నగరాలకు విస్తరించింది. 2006లో ఆయన మరణం తర్వాత భార్య జ్యోత్స్న సూరి నాయకత్వంలో ‘ద లలిత్’ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది.
హైకోర్టు తీర్పుతో ఇప్పుడు ఎన్డీఎంసీకి సర్వాధికారాలు లభించాయి. బకాయిలను వసూలు చేయడం కోసం హోటల్ను సీజ్ చేసే లేదా భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అయితే భారత్ హోటల్స్ లిమిటెడ్ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ భూములపై ప్రైవేట్ ప్రాజెక్టులు చేపట్టే ఇతర సంస్థలకు కూడా ఈ తీర్పు ఒక హెచ్చరికలాంటిదని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
