తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో కీలక ఊరట లభించింది. రాష్ట్రంలో బక్రీద్ రోజుతో పాటు ఏ రోజూ ఆవులు, దూడలను వధ చేయరాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును సుప్రీంకోర్టు సోమవారం తాత్కాలికంగా నిలిపివేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ వరకు హైకోర్టు ఆదేశాలకు స్టే విధించింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. హైకోర్టు ఉత్తర్వుల్లో సవరణ అవసరముందని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. వెంటనే ఆ ఆదేశాల అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు రెండు వారాల క్రితం విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు జంతు సంరక్షణ చట్టం-1958 ప్రకారం నిర్దిష్ట పరిస్థితుల్లో ఆవుల వధకు అనుమతి ఉన్నప్పటికీ.. హైకోర్టు పూర్తిస్థాయి నిషేధం విధించడం చట్టానికి విరుద్ధమని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది.
1958 చట్టం ఏమి చెబుతోంది?
తమిళనాడు జంతు సంరక్షణ చట్టం ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఆవులను వధ చేయడానికి అనుమతి ఉంది. ముఖ్యంగా ఆవు 10 సంవత్సరాలకు పైబడినట్లయితే, సంతానోత్పత్తికి లేదా వ్యవసాయ పనులకు పూర్తిగా పనికిరాకపోతే, సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం (సర్టిఫికేట్) పొందినట్లయితే చట్టబద్ధంగా వధకు అనుమతి ఉంటుంది. అయితే ఈ ఏడాది మే 27న జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ వి లక్ష్మీనారాయణతో కూడిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికారికంగా గుర్తింపు పొందిన స్లాటర్ హౌస్లలో మాత్రమే జంతువుల వధ జరగాలని పేర్కొంటూనే.. బక్రీద్ రోజుతో పాటు భవిష్యత్తులో ఏ రోజూ ఆవులు, దూడలను వధ చేయకుండా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా అధికారులకు తగిన సూచనలు ఇవ్వాలని కూడా హైకోర్టు పేర్కొంది.
ప్రభుత్వం వాదన ఇదే
హైకోర్టు ఉత్తర్వులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకవైపు చట్టబద్ధంగా అనుమతి ఉన్న సందర్భాలను గుర్తిస్తూ.. మరోవైపు పూర్తిస్థాయి నిషేధం విధించడం చట్ట పరిధిని మించి వెళ్లిన చర్య అని వాదించింది. ప్రజా ప్రదేశాల్లో అక్రమంగా ఆవులను వధ చేస్తున్నారంటూ ఇందు మక్కల్ కచ్చి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-48ను ప్రస్తావించింది. ఆర్టికల్-48 ప్రకారం పాడి పశువులు, దూడలు, వ్యవసాయానికి ఉపయోగపడే పశువుల వధను నిరోధించే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తుంది. ఇది రాజ్య విధాన మార్గదర్శక సూత్రాలలో భాగం. అయితే ఇవి నేరుగా కోర్టుల ద్వారా అమలు చేయదగిన హక్కులు కావని కూడా చట్టపరంగా స్పష్టం ఉంది.
ఇక తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఆవుల వధపై సంపూర్ణ నిషేధ ఉత్తర్వులు అమల్లో ఉండవని స్పష్టం చేసింది.

