Tamil Nadu: ఎంకే.స్టాలిన్ మాస్టర్ ప్లాన్.. తమిళనాడు అట్టుడుకనుందా!?

  • ఎంకే.స్టాలిన్ మాస్టర్ ప్లాన్
  • ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం
  • స్టాలిన్ వ్యూహం మారనుందా?
Stalin

Stalin

తమిళనాడు రాజకీయాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి ఐదు రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడ లేదు. అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అర్లేకర్ నిరాకరించారు. దీంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

ఇలాంటి తరుణంలో సందట్లో సడేమియాలా బద్ధ శత్రువులైనా డీఎంకే-ఏఐఏడీఎంకే ఏకమైపోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఈ వార్తలు వస్తున్నా.. తాజాగా ఆ ఊహాగానాలు కార్యరూపం దాల్చుతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ పరిణామాలు నిజం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

విజయ్ రెండు సార్లు కలిసినా ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించలేదు. ఈ నేపథ్యంలో డీఎంకే-అన్నాడీఎంకే కూటమిలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అంతర్గత చర్చల్లో నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఎంకే.స్టాలిన్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం కూడా ఆసక్తి రేపుతోంది.

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ద్రావిడ సెంటిమెంట్ సజీవంగా ఉంచేందుకు ఏఐఏడీఎంకేతో కలిస్తేనే మంచిది అని స్టాలిన్ అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వస్తున్నాయి. బీజేపీని వదులుకుంటే కలిసేందుకు సిద్ధమని అన్నాడీఎంకేకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. డీఎంకే ప్రతిపాదన నేపథ్యంలో అవసరమైతే బీజేపీని వదులుకునేందుకు ఏఐఏడీఎంకే కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ సంకేతాలు ఎంత వరకు నిజమవుతాయన్నది ఆసక్తిగా మారింది.

తాజా ఎన్నికల్లో డీఎంకే కూటగమి 73 స్థానాలు, ఏఐఏడీఎంకే కూటమి 53 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ రెండు కూటములు కలిస్తే మొత్తం 126 స్థానాలు అవుతున్నాయి. ఇది స్పష్టమైన మెజారిటీకి సరిపడే సంఖ్య. కానీ తమిళనాడు రాజకీయాల్లో కేవలం అంకెలు సరిపోవని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ప్రకటించడం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. దీంతో డీఎంకే బలం 68కి పడిపోయింది.

అదే సమయంలో బీజేపీ మద్దతుతో టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) ఏఐఏడీఎంకే కూటమిలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. AMMK ఒక ఎమ్మెల్యేను గెలుచుకుంది. ఏఐఏడీఎంకే.. డీఎంకేతో చేతులు కలపాలంటే బీజేపీతో దూరం కావాల్సి రావచ్చు. అలా జరిగితే పీఎంకేకు చెందిన నాలుగు ఎమ్మెల్యేలు, AMMK ఎమ్మెల్యే మద్దతు కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితిలో డీఎంకే-ఏఐఏడీఎంకే కలిపి బలం సుమారు 115 స్థానాలకు పడిపోతుంది. అంటే మెజారిటీ మార్క్ 118కు దిగువన ఉండే అవకాశముంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మిత్రపక్ష నేతలతో ఎంకే.స్టాలిన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీసీకే నేత తిరుమావళవన్, కమ్యూనిస్టు నేతలు షణ్ముగం, వీరపాండియన్‌లతో చర్చలు జరిపారు. విజయ్ తమ మద్దతు కోరిన నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మిత్రపక్షాలు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని.. డీఎంకే కూటమిని విడిచిపోవద్దని స్టాలిన్ సూచించినట్టు సమాచారం. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు మే 10 వరకు చెన్నైలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

అయితే డీఎంకేలోని కొందరు సీనియర్ నేతలు పరిస్థితిని బట్టి పార్టీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సంకేతాలు ఇస్తున్నారు. ‘‘విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై డీఎంకే ఆలోచిస్తుంది.’’ అని డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్. ఎస్. భారతి తెలిపారు. ‘‘తమిళనాడు ప్రజలు మళ్లీ ఎన్నికలు కోరుకోవడం లేదు. కాబట్టి పరిస్థితులను బట్టి మా నాయకుడు మిత్రపక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.’’ అని వ్యాఖ్యానించారు

నిజంగానే డీఎంకే-అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే గవర్నర్ ఆహ్వానిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆహ్వానిస్తే.. తమ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారని టీవీకే ఇప్పటికే బెదిరించింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున రాష్ట్రంలో అలజడులు కూడా చెలరేగవచ్చని వార్తలు వస్తున్నాయి. టీవీకే అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టొచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.