Tamil Nadu: తమిళనాడు ఎన్నికలు అంటేనే ‘‘ఉచితాలు’’. ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు కూడ ఉచితాలనే ఉపయోగిస్తుంటాయి. మరికొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫ్రీ హామీలు వర్షంలా కురస్తున్నాయి. అధికార డీఎంకేతో పాటు ప్రతిపక్ష అన్నాడీఎంకే ఓటర్లపై హామీల వర్షాన్ని కురిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఫ్రిజ్ ఇస్తామని అన్నాడీఎంకే చెబితే, డీఎంకే విద్యార్థినులకు ఉచిత ల్యాప్టాప్లు అంటూ ఊదరగొడుతోంది. డీఎంకేతో పోలిస్తే అన్నాడీఎంకే ఉచితాల్లో ముందుంది.
* తాము అధికారంలోకి వస్తే రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి ఉచితంగా రిఫ్రిజ్రేటర్ అందిస్తామని పళనిస్వామి హామీ ఇచ్చారు.
* డీఎంకే ప్రతీ నెల కుటుంబానికి రూ. 1000 ఇస్తుంటే, అన్నాడీఎంకే రూ. 2000 ఇస్తామని చెబుతోంది.
* డీఎంకే కేవలం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తుంటే, అన్నాడీఎంకే పురుషులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తామని చెప్పింది.
* ఇక విజయ్ టీవీకే పార్టీ రేషన్ కార్డు ఉన్నవారికి రూ. 2500 ఇస్తామని హమీ ఇచ్చింది.
* ఈ ఎన్నికల్లో గెలిస్తే ఉన్నత చదువులు చదివే 35 లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఉచితంగా పంప్ సెట్లు, మహిళా సంఘాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని డీఎంకే హామీ ఇచ్చింది.
ఉచితాల చరిత్ర ఇప్పటిది కాదు..
తమిళనాడులో ఉచితాల చరిత్ర కొన్ని దశాబ్ధాలతో ముడిపడి ఉంది. 1967లో సీఎన్ అన్నాదురై రూపాయికి బియ్యం ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత డీఎంకే నేత కరుణానిధి రేషన్ కార్డ్ ఉన్నవారికి 5 కేజీల బియ్యం ఇస్తానని హామీ ఇచ్చారు. 2006లో కరుణానిధి కలర్ టీవీ ఇస్తానని ప్రకటించి సంచలనం క్రియేట్ చేశారు. కరుణానిథి ప్రత్యర్థి జయలలిత ఓటర్లకు ల్యాప్లాప్, మిక్సర్ గ్రైండర్లు, ఫ్యాన్లు ఇలా ఉచితాల వెల్లువ కురిపించారు. 2016లో జయలలిత ఉచిత మొబైల్ ఫోన్లు, 100 యూనిట్ల ఫ్రీ కరెంట్, మహిళలకు రాయితీపై స్కూటర్లు, పెళ్లిళ్లలో బంగారం వంటి హామీలు ఇచ్చారు.
