తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పదవి స్వీకరణ తర్వాత తనదైన మార్క్ పాలనతో ముందుకుసాగుతున్నారు. తాజాగా మరో సరికొత్త, సరళత్వానికి నిదర్శనంగా నిలిచారు. బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ‘విఐపి సంస్కృతి’లో భాగమైన తెల్లటి టవల్ సంప్రదాయాన్ని తన కుర్చీ నుంచి తొలగించి, సాధారణ ప్రజలకు చేరువైన నాయకుడిగా తన ఇమేజ్ను మరింత బలోపేతం చేసుకున్నారు.
14 ఏళ్ల క్లైమేట్ యాక్టివిస్ట్ లిసిప్రియా కంగుజం సోషల్ మీడియాలో విజయ్ను ట్యాగ్ చేస్తూ ఒక అప్పీల్ చేశారు. “విఐపి కుర్చీలపై తెల్ల టవల్ సంస్కృతిని ముగించవచ్చా సార్? ప్రజలందరికీ తెలుసు మీరు విఐపీలని. ఈ సంప్రదాయం మంత్రులు, అధికారులు, చిన్న అధికారుల వరకు కొనసాగుతోంది. మీరు మార్పుకు స్ఫూర్తి” అని ఆమె రాసుకొచ్చారు. ఆ అప్పీల్ చేసిన 24 గంటల్లోనే విజయ్ సైలెంట్గా చర్య తీసుకున్నారు. సెక్రటేరియట్లో ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ సమీక్షా సమావేశంలో కుర్చీపై తెల్ల టవల్ లేకుండా విజయ్ కూర్చున్న ఫోటోలు సీఎం ఆఫీస్ షేర్ చేసింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేదు, పబ్లిసిటీ లేదు కేవలం నిశ్శబ్దంగా మార్పు తీసుకువచ్చారు.
ఈ చిన్న చర్య ద్వారా విజయ్ పెద్ద సందేశం ఇచ్చారు. “అధికారం సరళంగా, ప్రజలతో కలిసి ఉండాలి”. యాక్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ తన రాజకీయ ప్రయాణంలోనే అనేక సులభమైన చర్యలు చేపట్టారు. ఇది అతని ‘జన నాయగన్’ ఇమేజ్కు మరింత బలం చేకూరుస్తుంది. ఈ మార్పు చాలా మంది నెటిజన్ల నుంచి మంచి స్పందన పొందింది. “చిన్న చిన్న మార్పులే సమాజాన్ని మారుస్తాయి” అని కామెంట్లు చేస్తున్నారు. లిసిప్రియా అప్పీల్కు విజయ్ స్పందించడం యువత, ప్రజల మధ్య సమర్థవంతమైన సంభాషణను ప్రోత్సహిస్తుందని చెప్పవచ్చు. ఈ ఒక్క చర్య ద్వారా విజయ్ బ్రిటిష్-యుగ అవశేషాలను తొలగించి, ఆధునిక, ప్రజా స్నేహపరమైన రాజకీయ సంస్కృతికి మార్గం చూపారు. ఇలాంటి చిన్న మార్పులు ఇతర రాష్ట్రాల్లోనూ వ్యాప్తి చెందాలని ప్రజలు ఆశిస్తున్నారు.
తెల్ల టవల్ సంప్రదాయం వెనుక చరిత్ర
ఈ సంప్రదాయం బ్రిటిష్ కాలానికి చెందినదని చెబుతారు. ఏసీలు లేని రోజుల్లో అధికారులు ప్రయాణాలు చేసి వచ్చి చెమట తుడుచుకోవడం కోసం, పరిశుభ్రత కోసం టవల్ వేసేవారు. కాలక్రమేణా అది హైరార్కీ, అధికారం, విఐపి స్టేటస్ కు చిహ్నంగా మారిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులు, అధికారుల కుర్చీలపై ఈ తెల్ల టవల్ కనిపిస్తుంది. ఇది కొంతమంది ప్రకారం కాలం చెల్లిన కాలనీయ సంప్రదాయం.
