Swara Bhasker: నటి స్వరా భాస్కర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘‘పద్మావత్’’ సినిమా క్లైమాక్స్లో జౌహర్ సంప్రదాయం ప్రకారం శత్రు సేనలకు చిక్కకుండా రాజపుత్ర మహిళలు అగ్నిలోకి దూకి ఆత్మార్పణం చేసుకుంటారు. దీనిపై మాట్లాడుతూ.. ‘‘నా గౌరవాన్ని కాపాడుకోవడానికి నేను ఆత్మహత్య చేసుకోకపోతే పిరికిదానిలా భావించాల్సి వస్తుందా?’’ అంటూ కామెంట్స్ చేశారు. అత్యాచారం నుంచి బయటపడిన మహిళలు బతకడం తప్పు అనే భావన కలిగించేలా ఇలాంటి కథనాలు ఉండకూడదు అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలు వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా.. మహిళలు ఇతర మహిళలను గౌరవించడం ఎంతో ముఖ్యమని అన్నారు. స్వరా భాస్కర్ పేరు ప్రస్తావిస్తూ, ఆమె మాట్లాడుతున్న తీరు, వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శించారు. ఆమె ఎవరి గొంతుతో మాట్లాడుతున్నారో కూడా ప్రశ్నించారు. బీహార్కు చెందిన బీజేపీ నేత కృష్ణ కుమార్ సింగ్ స్వరా భాస్కర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ సమాజం, రాజ్పుత్ మహిళల్ని అవమానించేలా ఆమె వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కర్ణి సేన మహిళా విభాగం కూడా స్వరా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజ్పుత్ మహిళల త్యాగం, ధైర్యాన్ని ప్రశ్నించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆ సంస్థ నాయకురాలు కీర్తి రాథోర్ విమర్శించారు.
తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో స్వరా భాస్కర్ వివరణ ఇచ్చారు. తాను రాణి పద్మావతి లేదా జౌహర్ చేసిన మహిళలు పిరికివాళ్లు అని ఎప్పుడూ అనలేదని, తన వ్యాఖ్యల్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆమె అన్నారు. తన విమర్శ పద్మావత్లోని జౌహర్ సన్నివేశాన్ని చూపించిన విధానం, దాని ద్వారా మహిళల గౌరవం, అత్యాచారం, జీవించే హక్కు గురించి మాత్రమే అని స్పష్టం చేశారు.

