Suvendu Adhikari: రాజీనామా చేయనన్న మమత ప్రకటనపై సువేందు అధికారి ఏమన్నారంటే..!

  • రాజీనామా చేయనన్న మమత
  • ఘాటుగా స్పందిస్తున్న బీజేపీ నేతలు
  • రాజ్యాంగం ఏం చెబుతుందంటే..!
Suvendu Adhikari

Suvendu Adhikari

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని మమతా బెనర్జీ మొండికేశారు. ‘‘ఎన్నికల్లో ఓడిపోలేదని.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని.. లోక్‌భవన్‌కు కూడా వెళ్లను.’’ అని ప్రకటించారు. మమత చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రస్తుతం మమత వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఇక ఇదే అంశంపై సువేందు అధికారి స్పందించారు. ‘‘ఆమె (మమతా బెనర్జీ) ఏం చెబుతున్నారో నాకు తెలియదు. కానీ నేను చెప్పేది ఒక్కటే. అన్నీ రాజ్యాంగంలో రాసి ఉన్నాయి. అంతకు మించి నేను ఏమీ చెప్పనవసరం లేదు.’’ అని అన్నారు. 294 స్థానాలకు గాను 207 స్థానాలు గెలుచుకుని బీజేపీ అది పెద్ద శక్తిగా నిలిచింది. అయితే మర్యాదగా మమత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ చేయనని భీష్మించుకుని కూర్చున్నారు.

గవర్నర్‌ అధికారాలివే..
ఒకవేళ ముఖ్యమంత్రి రాజీనామా చేయకపోతే గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. గవర్నర్ ముందుగా ఓడిపోయిన ముఖ్యమంత్రి రాజీనామాను కోరవచ్చు. నిరాకరిస్తే.. అసెంబ్లీని తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వు జారీ చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో గవర్నర్ ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించవచ్చు. ఒకవేళ ముఖ్యమంత్రి ఏదైనా చర్య తీసుకున్నా లేదా పెద్ద సంక్షోభం తలెత్తినా గవర్నర్ ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయవచ్చు. రాష్ట్రాల్లో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైన సందర్భాల్లో ఇది జరుగుతుంది. అయితే పశ్చిమ బెంగాల్ విషయంలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది.

కొత్త ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది?
ఆర్టికల్ 164 ప్రకారం.. కొత్త ముఖ్యమంత్రిని నియమించి.. ప్రమాణ స్వీకారం చేయించే అధికారం గవర్నర్‌కు ఉంది. ఎన్నికలలో ఓడిపోయిన ప్రభుత్వాన్ని.. ముఖ్యమంత్రిని తొలగించిన తర్వాత గవర్నర్ శాసనసభ పక్ష నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవచ్చు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. దీని అర్థం.. మమతా బెనర్జీ రాజీనామా చేయకపోయినా.. ప్రజా తీర్పు తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగలేరు.

దిలీప్ ఘోష్…
మమతా బెనర్జీ ప్రకటనపై బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ కూడా స్పందించారు. మమతా బెనర్జీ అపరిపక్వంగా, చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారని, అలా ప్రవర్తించడం ఆమె నైజమన్నారు. ఈ ఆట ముగియక తప్పదని పేర్కొన్నారు. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ముఖ్యమంత్రిని ఎన్నుకోవడంలో బీజేపీకి పద్ధతి ఉందన్నారు. ఆ వ్యక్తి ఎప్పుడూ మనం ఊహించని వారై, ఆశ్చర్యాన్ని కలిగిస్తారని తెలిపారు.

మమత ఏమన్నారంటే..
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తేలేదని మమతా బెనర్జీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మమత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఓడిపోలేదు.. రాజీనామా చేయను. లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కూడా కలవను. తన ఓటమికి ఎన్నికల సంఘమే కారణం. 100 సీట్లను బీజేపీ దొంగిలించింది. కౌంటింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు తనపై దాడి కూడా జరిగింది.’’ అని మమత ఆరోపించారు.