గుజరాత్లో ఘోరం జరిగింది. సూరత్లో ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త అశోక్ కేజ్రీవాల్ కుటుంబానికి చెందిన కోడలు ఖ్యాతి కేజ్రీవాల్ (28) ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం సాయంత్రం ఇంట్లోని పడకగదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. దీంతో ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న విషయంపై సందిగ్ధం నెలకొంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి తగాదాలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మొబైల్, డిజిటల్ పరికరాల నుంచి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఏదైనా క్యూ లభించొచ్చని భావిస్తున్నారు.
2 నెలల క్రితం పెళ్లి..
వస్త్ర వ్యాపారవేత్త అశోక్ కేజ్రీవాల్ సూరత్లోని సుభాష్ నగర్లో నివాసం ఉంటున్నారు. రెండు నెలల క్రితమే కుమారుడు అభిషేక్ కేజ్రీవాల్కు మహారాష్ట్రలోని థానేకు చెందిన వ్యాపారవేత్త కుమార్తె ఖ్యాతితో వివాహం జరిపించారు. మంగళవారం అభిషేక్ కేజ్రీవాల్ ఇంటి కింది అంతస్తులో తన కార్యాలయంలో పని చేసుకుంటున్నాడు. అభిషేక్కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇంటి నుంచే పని చేస్తున్నాడు. సాయంత్రం 5:30 గంటలకు ఖ్యాతి బయటకు రాకపోవడంతో అభిషేక్ తల్లికి అనుమానం వచ్చి విషయం తెలియజేసింది. దీంతో వెంటనే ఖ్యాతికి అభిషేక్ ఫోన్ చేశాడు. కానీ స్పందన రాలేదు. వేరే తాళంతో డోర్ తెరిచారు. సీలింగ్ ఫ్యాన్కు ఖ్యాతి వేలాడుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు.
వెంటనే ఉమ్రా పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపించారు. రాత్రిపూట పోస్ట్మార్టం సాధ్యం కాకపోవడంతో మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజ్లో ఉంచారు. మరుసటి రోజు కొత్త సివిల్ ఆసుపత్రిలో వైద్యుల బృందం పోస్ట్మార్టం నిర్వహించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం ఉరి వేసుకోవడమే మరణానికి కారణమని తేలింది. అయితే పోలీసులు అంతర్గత అవయవాలను భద్రపరిచి, ఇతర కోణాలను దర్యాప్తు చేయడానికి ఎఫ్ఎస్ఎల్ (FSL) పరీక్షకు పంపించారు.
పోలీసు అధికారుల ప్రకారం.. ఇప్పటివరకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో ఆత్మహత్యకు అసలు కారణం వెల్లడి కాలేదు. మృతురాలి మొబైల్ ఫోన్, ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు. మృతురాలి తల్లి, అత్తమామల వాంగ్మూలాలు తీసుకున్నారు.
అశోక్ కేజ్రీవాల్ కుటుంబానికి వస్త్ర ఉత్పత్తులు ఉన్నాయి. యూరప్, ఆసియా, ఆఫ్రికా వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తుంటారు. ఈ కుటుంబానికి బలమైన రాజకీయ, పరిపాలనా సంబంధాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. రెండు నెలల క్రితం జరిగిన ఖ్యాతి, అభిషేక్ల వివాహానికి పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
ఖ్యాతి తల్లిదండ్రులు మహారాష్ట్రలోని థానేలో నివసిస్తున్నారు. ఆమె తండ్రి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. ఇరు కుటుంబాలు ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబాలుగా ఉన్నాయి. రెండు నెలలకే ఖ్యాతి చనిపోవడంతో తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉమ్రా పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
