Site icon NTV Telugu

Supreme Court: పంచుకుంటూ పోతే మిగిలేది ఏముండదు.. ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆక్షేపణ

Supremecourt

Supremecourt

ఎన్నికల ముందు ఉచిత పథకాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచుకుంటూ పోతే అభివృద్ధికి ఒక్క పైసా కూడా మిగలదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ ప్రకటించింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గురువారం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత పథకాలను ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది.

ఇది కూడా చదవండి: IAS Wedding: బ్యాండ్‌ లేదు.. తంతు లేదు.. సచివాలయంలో దండలతో ఒక్కటైన ఐఏఎస్ జంట

ఉచిత విద్యుత్ హామీకి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో సమాధానం దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశించగా.. కేంద్రానికి నోటీసు జారీ చేసింది. ఎన్నికల్లో గెలిచేందుకు ఆహారం, ఉచిత్ విద్యుత్ అందిస్తామంటే వాస్తవ పరిస్థితికి నిధులు ఎలా సమకూర్చుతారో చెప్పాలని డిమాండ్ చేసింది. అయినా ఆర్థిక స్థోమత ఉన్నవారికి కూడా ఉచితంగా ఇస్తామని చెప్పడం ఇదే సంస్కృతి అని ప్రశ్నించింది.

భారతదేశం అంతటా ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాము? అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ‘‘మీరు ఉదయం నుంచి ఉచిత ఆహారం ఇవ్వడం ప్రారంభిస్తే… తర్వాత ఉచిత సైకిల్… తర్వాత ఉచిత విద్యుత్.. ఇప్పుడు మనం నేరుగా ప్రజల ఖాతాలోకి నగదును బదిలీ చేసే దశకు చేరుకుంటున్నాము. ఊహించుకోండి.’’ అని అన్నారు. ‘‘చెల్లించలేని వారికి సంక్షేమ వ్యవస్థలో భాగంగా అందించడం అర్థముంది. కానీ స్థోమత ఉన్నవారు.. చేయలేనివారు అనే తేడా లేకుండా పంపిణీ చేస్తే ఎలా?.’’ అని సీజేఐ నిలదీశారు.

‘‘ప్రతి రాష్ట్ర ఆదాయంలో కనీసం పావు వంతు అభివృద్ధి పనులకు ఉపయోగించాలన్నారు. కొన్నిసార్లు మేము నిజంగా ఆందోళన చెందుతున్నాం. మీరు రెవెన్యూ మిగులు రాష్ట్రమైనప్పటికీ… మొత్తం ప్రజల అభివృద్ధికి ఖర్చు చేయడం. మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలను అభివృద్ధి చేయడం మీ బాధ్యత కాదా? బదులుగా మీరు ఎన్నికల సమయంలో వస్తువులను పంపిణీ చేస్తూనే ఉంటారు..’’ అని తెలిపారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి విధానాల వల్ల అభివృద్ధికి ఒక్క పైసా కూడా మిగలడం లేదు. ఇది మీది మాత్రమే కాదు. అన్ని రాష్ట్రాల సమస్య.’’ అని తమిళనాడు ప్రభుత్వానికి ధర్మాసనం తెలిపింది.

జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి మాట్లాడుతూ.. ఉచిత పథకాలు పంపిణీ చేయాలనుకునే రాష్ట్రాలు ‘‘మీ బడ్జెట్ కేటాయింపులలో పొందిపరచండి. మీరు అలా ఎలా చేస్తారో తెలియజేయండి.’’ అని సూచించారు.

గత ఏడాది నవంబర్‌లో ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మహారాష్ట్రలోని ‘లడ్కీ బహిన్’ పథకాన్ని ప్రస్తావించారు. 21 నుంచి 65 ఏళ్ల మధ్య వార్షిక కుటుంబ ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న మహిళలకు నెలకు రూ. 1,500 చొప్పున ఇస్తున్నారు. ‘‘ఎన్నికల ముందు ప్రకటించిన ఉచితాల కారణంగా ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదు.’’ అని వ్యాఖ్యానించారు.

Exit mobile version