నీట్ నిరసనకారులకు భారీ ఊరట లభించింది. నిరసనకారులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. దీంతో విద్యార్థులకు ఉపశమనం లభించింది. కానీ నేర చరిత్ర ఉన్న వారికి మాత్రం షాకిచ్చింది. వారిపై మాత్రం కేసులు కొనసాగుతాయని సుప్రీం కోర్టు తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్కు నిజాయితీగా నిరసన తెలిపేందుకు వచ్చిన యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆర్టికల్ 142 కింద కేసులు రద్దు చేసినట్లు న్యాయస్థానం తెలిపింది. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన నిరసనల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు అన్నింటినీ రద్దు చేసింది. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన సీజేపీ నిరసనలపై దేశంలో ఎక్కడా ఎఫ్ఐఆర్లను నమోదు చేయొద్దని ఆదేశించింది. 2,873 నేరచరిత్ర కలిగిన వారిపై మాత్రం ఎఫ్ఐఆర్లు రిజిస్ట్రేషన్పై పోలీసులకు స్వేచ్ఛనిచ్చింది. ఇక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నష్టపరిహారం చెల్లింపులపై విధివిధానాలు రూపొందించాలని సూచించింది. విధివిధానాలు రూపొందించిన మూడు నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహనకు కట్టుబడి ఉండాలనే షరతుకి లోబడి ఆర్టికల్ 142 కింద ఎఫ్ఐఆర్లను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది.
కేసులు కొట్టేయడంతో సెప్టెంబర్ 5న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన మార్చ్ను రద్దు చేస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. సెప్టెంబర్ 5న చేపట్టాల్సిన నిరసన పిలుపును ఉపసంహరించుకుంటున్నట్లు సీజేపీ ప్రతినిధులు తెలిపారు.

