Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు

  • హిందూ మతం ఓ జీవన విధానం
  • దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు
Supremecourt

Supremecourt

హిందువునని నిరూపించుకోవడానికి ఒక దీపం చాలని.. గుడికి వెళ్లనవసరం లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక వ్యక్తి తన ఇంట్లో దీపం వెలిగించినా కూడా అది అతని మతాన్ని నిరూపించడానికి సరిపోతుంది.’’ అని తెలిపారు. ఇక ఆచారాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదని జస్టిస్ నాగరాత్న అన్నారు.

హిందూమతం ఒక జీవన విధానమని.. హిందువుగా కొనసాగడానికి గుడికి వెళ్లడం గానీ.. ఏవైనా ఆచారాలు పాటించడం గానీ తప్పనిసరి కాదని.. ఇంట్లో దీపం వెలిగించడం కూడా విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి సరిపోతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. కేరళలోని శబరిమల ఆలయంతో సహా మతపరమైన ప్రదేశాలలో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

జస్టిస్ నాగారత్న మాట్లాడుతూ.. ‘‘అందుకే హిందూ మతాన్ని ఒక జీవన విధానం అంటారు. హిందువుగా ఉండటానికి గుడికి వెళ్లడం గానీ, ఏవైనా ఆచారాలు పాటించడం గానీ తప్పనిసరి కాదు. ఆచారబద్ధంగా ఉండాల్సిన అవసరం లేదని, ప్రజలకు విశ్వాసం ఉండటానికి ఏదీ అడ్డురాదు’’ అని జస్టిస్ నాగారత్న అన్నారు.

‘‘ఒక వ్యక్తి తన ఇంట్లో దీపం వెలిగించినా కూడా అది అతని మతాన్ని నిరూపించడానికి సరిపోతుంది.’’ అని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రతి మత ఆచారాన్ని లేదా మతానికి సంబంధించిన విషయాన్ని రాజ్యాంగ న్యాయస్థానంలో ప్రశ్నించడం ప్రారంభిస్తే.. వందలాది పిటిషన్లు దాఖలవుతాయని.. ఇది ప్రతి మతం ‘‘పతనానికి’’ దారితీస్తుందని కోర్టు గతంలో వ్యాఖ్యానించింది.