Bhojshala: వివాదాస్పద ‘‘భోజ్‌శాల’’లో హిందూ, ముస్లిం ప్రార్థనలకు సుప్రీంకోర్టు అనుమతి..

  • భోజ్‌శాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
  • హిందూ, ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి..
  • మధ్యప్రదేశ్‌లో మందిర్-మసీద్ వివాదం..
  • బసంత్ పంచమి, శుక్రవారం కావడంతో ప్రార్థనలకు సమయాలు కేటాయింపు..
Bhojshala

Bhojshala

Bhojshala: మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఉన్న వివాదాస్పద భోజ్‌శాల ఆలయం-కమల్ మౌలా మసీదు సముదాయంలో శుక్రవారం ప్రార్థనలు చేసుకోవడానికి హిందువులు, ముస్లింలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది శుక్రవారం నాడు వచ్చే హిందువుల పండగ బసంత పంచమి సందర్భంగా హిందువులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే, ముస్లింలు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు శుక్రవారం ప్రార్థనలు చేసుకోవచ్చని చెప్పింది. నమాజ్ కోసం వచ్చే ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల సంఖ్యను జిల్లా యంత్రాగానికి తెలియజేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. శాంతిభద్రతల విషయంలో సరైన ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వసంత పంచమి రోజున ప్రార్థనలు చేయడానికి హిందువులకు ప్రత్యేక హక్కులు కల్పించాలని కోరుతూ హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ (హెచ్‌ఎఫ్‌జె) అనే హిందూ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ కోసం కోరారు. ఈ సంస్థ తరుపున వాదించిన న్యాయవాది విష్ణు శంకర్ జైన్ జనవరి 2న దాఖలు చేసిన పిటిషన్‌ను దాఖలు చేశారు.

Read Also: Akash Biswas: యువ క్రికెటర్ రెండు కిడ్నీలు ఫెయిల్.. సీఎం మమతా బెనర్జీ సహాయం కోరిన కోచ్

ఈ పిటిషన్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) 2003లో జారీ చేసిన ఆదేశాల్లో ఉన్న లోపాన్ని న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చారు. ఆ ఆదేశాలు సాధారణ రోజుల్లో ప్రార్థనల నిర్వహణపై స్పష్టంగా ఉన్నప్పటికీ, బసంత్ పంచమి శుక్రవారం కలిసి వచ్చే పరిస్థితిని ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు.

2003 ఏఎస్ఐ ఆదేశాల ప్రకారం, ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింలకు అనుమతి ఉంది. హిందువులు బసంత్ పంచమి రోజు పూజలు నిర్వహించుకునే అనుమతి ఉంది. ప్రతీ మంగళవారం హిందువులు పూర్తి, ప్రత్యేక ప్రవేశహక్కు కలిగి ఉన్నారు. అయితే, బసంత్ పంచమి, శుక్రవారం కలిసి వస్తే హిందూ, ముస్లింలు ఎంత సమయం ప్రార్థన చేయాలనే దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంంలో జనవరి 23న హిందువులకు ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రత్యే పూజా హక్కుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.