NTV Telugu Site icon

Hizb-ut-Tahrir: దేశభద్రతలకు ముప్పు.. ‘‘హిజ్బ్-ఉత్-తహ్రీర్‌’’ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కేంద్రం..

Hizb Ut Tahrir

Hizb Ut Tahrir

Hizb-ut-Tahrir: ఐఎస్ఐఎస్ ప్రేరేపిత రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ ‘‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’’(HuT)ని కేంద్రం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం(UAPA) కింద ఉగ్రవాద సంస్థగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) గురువారం అధికారికంగా ప్రకటిస్తూ, నిషేధం విధించింది. ఈ ఉగ్రవాద సంస్థ యువకులను మోసపూరితంగా మార్చడంతో పాటు ఉగ్రవాదానికి నిధులు, భారతదేశ జాతీయ భద్రతకు, సార్వభౌమత్వానికి తీవ్రమైన ముప్పుగా కలిగిస్తోందని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యలతో UAPA కింది తీవ్రవాద సంస్థగా గుర్తించబడిన 45వ సంస్థగా హిజ్బ్-ఉత్-తహ్రీర్ చేరింది.

Read Also: Saddula Bathukamma: తెలంగాణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు..

ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. నరేంద్రమోడీ టెర్రరిజం పట్ట జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నారని, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ రోజు హిజ్బ్-ఉత్-తహ్రీర్‌ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్లు వెల్లడించారు.

హోంమంత్రిత్వ శాఖ తన అధికారిక నోటిఫికేషన్‌లో.. దేశంలోని పౌరులను ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లించి, జివాద్ ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ రాజ్యాన్ని, కాలిఫేట్‌ని స్థాపించాలని లక్ష్యంతో పనిచేస్తోందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు, దేశ అంతర్గత భద్రతకు ఈ సంస్థ తీవ్ర ముప్పుగా మారిందని పేర్కొంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ ద్వారా యువతను మోసపూరితంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడేలా చేస్తుందని, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పింది.