Kerala: కేరళ యువతిని పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్

  • కేరళ యువతిని పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ
  • గురువాయూర్ ఆలయంలో భారతీయ పద్ధతుల్లో పెళ్లి
  • సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
Kerala

Kerala

పదేళ్ల నాటి కల ఇన్నాళ్లకు నెరవేరింది. స్కాట్లాండ్ ఎంపీ మార్టిన్ డే.. కేరళకు చెందిన నితిన్ చంద్‌ వివాహం గురువాయూర్ ఆలయంలో జరిగింది. స్కాటిష్ నేషనల్ పార్టీ నాయకుడు, స్కాటిష్ పార్లమెంట్ సభ్యుడు మార్టిన్ డే కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయంలో సాంప్రదాయ భారతీయ పద్ధతుల్లో నితిన్ చంద్‌ను వివాహం చేసుకున్నారు. నితిన్ చంద్ మెడలో మార్టిన్ డే మూడు ముళ్లు వేశారు. ఈ కార్యక్రమానికి బంధువులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివాహ వేడుకకు నితిన్ చంద్ కుమారుడు కూడా హాజరయ్యాడు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నితిన్ చంద్ ఎర్నాకులం జిల్లాలోని పిరవోమ్‌కు చెందినవారు. ఆమె ఐటీ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్యను అభ్యసించడానికి 2008లో యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లారు. ఈ సమయంలో ఆమె మార్టిన్ డేను కలిశారు. కాలక్రమేణా వారి సంబంధం బలపడింది. 2016లో వారు బ్రిటన్‌లో వివాహం చేసుకున్నారు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నితిన్ తన వివాహ వేడుకను గురువాయూర్ ఆలయంలో సాంప్రదాయబద్ధంగా జరిపించుకోవాలని చాలా కాలంగా కోరుకుంటుంది. అయితే కేరళ వరదలు, ఆ తర్వాత కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ప్రణాళిక చాలా సంవత్సరాలు వాయిదా పడింది. చివరకు ఈ జంట గురువాయూర్‌కు చేరుకుని.. ఈ వారంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహ వేడుకను జరుపుకుని తమ పదేళ్ల నాటి కోరికను నెరవేర్చుకున్నారు.

మార్టిన్ డే ఎవరు?

మార్టిన్ డే (55) స్కాటిష్ నేషనల్ పార్టీ సీనియర్ నాయకుడు. చాలా కాలంగా స్కాటిష్ రాజకీయాలలో చురుకుగా ఉన్నారు. స్థానిక, జాతీయ స్థాయిలలో లిన్లిత్‌గో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1999లో వెస్ట్ లోథియన్ కౌన్సిల్ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2015లో లిన్లిత్‌గో, ఈస్ట్ ఫాల్కిర్క్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు.

మార్టిన్ డే 2024 వరకు ఆరోగ్య, సామాజిక సంరక్షణ రంగంలో స్కాటిష్ నేషనల్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఎంపీగా పనిచేశారు. 2026 స్కాటిష్ పార్లమెంట్ ఎన్నికలలో తిరిగి ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించి.. ఫాల్కిర్క్ ఈస్ట్, లిన్లిత్‌గో నియోజకవర్గం నుంచి స్కాటిష్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం స్కాటిష్ పార్లమెంట్ వాతావరణ కార్యాచరణ కమిటీ, ఆర్థిక, పర్యాటక, ఇంధన కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు మార్టిన్ డే బ్యాంకింగ్‌లో పనిచేశారు. వెస్ట్ లోథియన్‌లోని స్థానిక ప్రభుత్వంలో పాలుపంచుకున్నారు.

నితిన్ చంద్ ఎవరు?

నితిన్ చంద్ కేరళలోని ఎర్నాకులం జిల్లా పిరవోం ప్రాంతానికి చెందినవారు. ఆమె ఉన్నత విద్య కోసం 2008 నవంబర్‌లో యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లి ఐటీ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. నితిన్.. రిటైర్డ్ వెటర్నరీ అధికారి కె.ఎన్. చంద్రన్, పంపాకుడ గ్రామ పంచాయతీ మాజీ సభ్యురాలు రాజమ్మల కుమార్తె. యూకేలో పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో కొత్త వలస నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీంతో నితిన్‌తో సహా వేలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు అయ్యాయి. యూకేను విడిచి వెళ్లకుండా ఈ విషయంలో చురుకైన పాత్ర పోషించారు. ఆ సమయంలో ఎంపీ మార్టిన్ డేతో పరిచయం ఏర్పడింది. తమ సమస్యను వెళ్లబుచ్చింది. సమస్యలను పార్లమెంట్‌లో మాట్లాడేటట్టు సంప్రదింపులు జరిపింది.

ఇలా ఇద్దరి మధ్య పరిచయం కాస్త వివాహం దిశగా వెళ్లింది. దీంతో 2016లో వివాహం చేసుకున్నారు. మార్టిన్ డే 2016 మే నెలలో ఆమెకు ప్రపోజ్ చేసినట్లు సమాచారం. నిధిన్ తనకు విడాకులు అయ్యాయని.. 12 ఏళ్ల కొడుకు ఉన్నాడని మార్టిన్‌కు చెప్పినప్పుడు.. మార్టిన్ తల్లి, కొడుకులను సాదరంగా ఆహ్వానించాడు. ఆ తర్వాత నిధిన్‌ను తన తల్లిదండ్రులైన మార్గరెట్ డే, రాన్ డేలకు పరిచయం చేశాడు. వాళ్లు కూడా స్వాగతించారు. వీసా, ఉద్యోగ స్థితికి సంబంధించి అనిశ్చితి ఉన్నప్పటికీ.. ఆ కుటుంబం కూడా నిధిన్‌ను ఎంతో ఆప్యాయంగా స్వాగతించి చేర్చుకుంది.