AAP: ఢిల్లీ జల్ బోర్డ్ మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) టెండర్ కుంభకోణంలో ఢిల్లీ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ (ACB) ఆప్ నేత, మాజీ జలవనరులు మంత్రి సత్యేంద్ర జైన్ను అరెస్ట్ చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు ఎదురుదెబ్బ తగిలింది. జైన్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాష్ రాయ్తో సహా మొత్తం ఆరుగురు నిందితులను ఏసీబీ అరెస్టు చేసింది. అరెస్టైన వారిలో ఉదిత్ ప్రకాష్ రాయ్ (ఢిల్లీ జల్ బోర్డ్ మాజీ సీఈఓ), అంకిత్ శ్రీవాస్తవ (డీజేబీ మాజీ కాంట్రాక్టు కన్సల్టెంట్), నాగేంద్ర యాదవ్ (ఏఎన్ ఎంటర్ప్రైజెస్ యజమాని), రాజా కుమార్ కుర్రా (యూరోటెక్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని), పంకజ్ వర్మ (శ్రీజన్హర్ యజమాని) ఉన్నారు.
మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఆధునీకరణ, సామర్థ్య విస్తరణ కోసం జారీ చేసిన టెండర్లలో స్కామ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. యూరో టెక్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి నేరుగా ప్రయోజనం చేకూర్చేందుకు టెండర్లో సాంకేతిక నిబంధనలు మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపాదిత పైలట్ అధ్యయనాన్ని నిర్వహించకుండానే ఇతర కంపెనీల నుంచి పోటీని తొలగిస్తూ కొన్ని నిబంధనల్ని మార్చినట్లు తేలింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఆర్థికనష్టం వాటిల్లినట్లు ఏసీసీ ఆరోపిస్తోంది.
దర్యాప్తులో ఏసీబీకి పలు ఎక్ట్రానిక్ ఆధారాలు లభించినట్లు తెలిసింది. ప్రైవేట్ వ్యక్తులు, మధ్యవర్తులు, ప్రభుత్వ అధికారుల మధ్య జరిగిన ఈమెయిల్స్, మెసేజ్లు పరిశీలించగా, టెండర్ పత్రాలు, సవరణ పత్రాలు ముందుగానే ఒకరితో ఒకరు పంచుకున్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఆ తర్వాత మార్పులును ప్రభుత్వం టెండర్ పత్రాల్లో చేర్చినట్లు ఏసీబీ ఆరోపించింది. దీంతో అధికారుల, సంబంధిత కంపెనీ మధ్య కమ్ముక్కు జరిగిందనే అనుమానాలకు ఆధారాలు లభించినట్టు ఏసీబీ పేర్కొంది. అప్పటి DJB CEO ఉదిత్ ప్రకాష్ రాయ్కు సంబంధించిన వ్యక్తులు, ఆయన బంధువుల బ్యాంకు ఖాతాలకు ఏఎన్ ఎంటర్ప్రైజెస్ ద్వారా సుమారు రూ.1.52 కోట్లు బదిలీ అయ్యాయి. ఈ డబ్బును యూరోటెక్కు అనుబంధంగా ఉన్న సంస్థల ద్వారా మళ్లించి, ఆ తర్వాత ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించారు. ఈ లంచం సొమ్ము లావాదేవీల మూలాలపై దర్యాప్తు జరుగుతోందని ఏసీబీ తెలిపింది.

